ఢిల్లీ ఎన్నికల్లో.. ఆప్‌కు భారీ షాక్‌

  • రాజీనామా చేసిన ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ, జనవరి 31: మరో ఐదు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార ఆప్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ పక్క ప్రచారం హోరెత్తిస్తూనే.. మరో పక్క హావిూల వర్షం గుప్పిస్తూ ప్రజలను ఆకర్శిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగలింది. ఎన్నికలకు ముందు ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మోహ్రౌలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నరేష్‌ యాదవ్‌ అదును చూసి కేజీవ్రాల్‌ పార్టీని దెబ్బకొట్టారు. ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ ఖురాన్‌ను అపవిత్రం చేసిన కేసులో దోషిగా తేలాడు. దీంతో అతడికి ఈ ఎన్నికల్లో ఆప్‌ ఎమ్మెల్యే టికెట్‌ నిరాకరించింది. నరేష్‌ యాదవ్‌ స్థానంలో మెహ్రౌలీ నియోజకర్గం నుంచి ఆప్‌ మహేందర్‌ చౌదరిని బరిలోకి దించింది. ఆప్‌ టికెట్‌ నిరాకరించడంతో అసంతృప్తికి గురైన నరేష్‌ యాదవ్‌.. సరిగ్గా ఎన్నికలకు ఐదు రోజుల ముందు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు రాజీనామా లేఖను ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజీవ్రాల్‌కు పంపారు. ఎన్నికలకు ముందు పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అధికార ఆప్‌ కు ఇబ్బందికరంగా మారింది. ఆప్‌కు గుడ్‌ బై చెప్పిన నరేష్‌ యాదవ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 70 స్థానాలకు సింగల్‌ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రెండు పర్యాయాలుగా తిరుగులేని విజయం సాధించిన ఆప్‌.. హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైన దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో వరుసగా దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌.. హస్తినాలో తిరిగి పునర్వైభవం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీల ట్రయాంగిల్‌ పోరుతో ఢిల్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News