- జాతరచుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలతో సర్క్యూట్
- అధికారులతో సవిూక్షలో సిఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 29: సమ్మక్క – సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలన్న ఆ యా శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ జాతరతో పాటు ఆ సవిూప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారికి సీఎం సూచించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీ లోపు పూర్తి టూరిజం పాలసీని సిద్దం చేయాలని ఉన్నతాధికారులకు ఆయన గడువు విధించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో టూరిజం పాలసీ విధి విధానాలు ఖరారు చేసేందుకు పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సవిూక్ష సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. అందులోభాగంగా దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పాలసీని రూపొందించాలని చెప్పారు.
అలాగే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలంటూ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలంటూ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.