కాకినాడలో.. ఐటి దాడుల కలకలం

  • కంపెనీ మేనేజర్‌ అశోక్‌ ఇంట్లో అధికారులు సోదాలు

అమరావతి, జనవరి 29: కాకినాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాకినాడలో సత్యం బాలాజీ రైస్‌ కంపెనీపై బుధవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కంపెనీ మేనేజర్‌ అశోక్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల స్టెల్లా షిప్‌లో రేషన్‌ బియ్యం లోడ్‌ చేసి సత్యం బాలాజీ సంస్థ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థపై కేసు నమోదు అయ్యింది. తాజాగా సత్యం బాలాజీ రైస్‌ కంపెనీపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు లక్షల టన్నుల్లో బియ్యాన్ని సత్యం బాలాజీ కంపెనీ ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ మేనేజర్‌ నివాసంలో ముగ్గురు అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా సత్యం బాలాజీ కంపెనీ భారీ ఎత్తున బియ్యాన్ని నిల్వలు చేస్తుంది. దానికి సంబంధించి మూడు గోడౌన్లలో అధికారులు విడివిడిగా తనిఖీలు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ కేంద్రంగా ఈ కంపెనీ బియ్యం వ్యాపారం చేస్తోంది. అందులో భాగంగా చత్తీస్‌గఢ్‌ నుంచి కాకినాడకు బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.

గత నెలలో స్టెల్లా షిప్‌లో రేషన్‌ బియ్యాన్ని గుర్తించిన అధికారులు .. ఆ రైస్‌ మొత్తం ఈ కంపెనీదే అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బాలాజీ కంపెనీపై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్‌ బియ్యం అక్రమరవాణాపై ఉక్కపాదంమోపి పలు గోడౌన్లలో తనిఖీలు చేపట్టింది. అందులో కూడా సత్యం బాలాజీ కంపెనీ ఉన్నట్లు అధికారులు తేల్చి కేసులు నమోదు చేశారు. కాకినాడ నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో సత్యం బాలాజీ సంస్థ కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఐటీ దాడులు సాగుతున్నాయి. ఈ కంపెనీ యజమాని చత్తీస్‌గఢ్‌లో ఉన్నందున కొన్ని బృందాలు అక్కడకు కూడా వెళ్లి తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం పెద్దాపురం కేంద్రంగా లలిత రైస్‌ ఇండస్ట్రీలో అధికారులు దాదాపు నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్న కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.

కాగా.. గత ఏడాది నవంబర్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ పోర్టును సందర్శించగా.. స్టెల్లా నౌకలో రేషన్‌ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్టెల్లా నౌకను సీజ్‌ చేయాల్సిందిగా అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీంతో దాదాపు 55 రోజుల పాటు స్టెల్లా నౌక కాకినాడ పోర్టులోనే ఉండిపోయింది. స్టెల్లా నౌకలోకి 32,415 టన్నులు లోడవగా అందులో రేషన్‌ బియ్యం ఉన్నట్లు బయటపడిరది. ఆ బియ్యాన్ని లోడ్‌ చేసింది సత్యం బాలాజీ కంపెనీగా నిర్ధారించారు. దాదాపు నెలరోజుల పాటు నౌకలో లోడింగ్‌ అయిన రేషన్‌ బియ్యం ఎంత అనేదానిపై ఆరా తీశారు. 1320 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తేల్చారు. అనంతరం రేషన్‌ బియ్యాన్ని గోడౌన్‌లకు తరలించి.. స్టెల్లా నౌక పయనానికి ఓకే చెప్పడంతో దాదాపు 55 రోజుల తర్వాత పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరి వెళ్లింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News