జవాబు దారీతనం లేని పాలక, ప్రతిపక్షాలు !

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల చివర్లో ప్రారంభమవుతున్న వేళ కొత్తగా ఆశలు చిగురిస్తున్నా.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత పదేళ్ల కాలంలో బడ్జెట్‌ సమావేశాల ద్వారా ఎలాంటి అద్భుతాలను చూడలేదు. ప్రజలు రక్తమాంసాలు ధారపోసి కడుతున్న పన్నులతో పాలకులు జలసాలు చేస్తున్నారు. ఫస్ట్‌క్లాస్‌ రైళ్లల్లో, విమానాల్లో తిరుగు తున్నారు. అందమైన భవంతుల్లో ఉంటున్నారు. తమ అవసరాలకు లెక్కకు మిక్కిలి ఖర్చు పెట్టుకుంటు న్నారు, తమకు అవసరమైన మేరకు జీతాలు పెంచేసుకుంటున్నారు. పెన్షన్లు పొందుతున్నారు. కానీ వీరంతా దేశం కోసం, ప్రజల కోసం ఏనాడూ ఆలోచించడం లేదు. ఒక్క సమస్యపైనా చర్చించడం లేదు. బడ్జెట్‌లో గొప్పగా కేటాయింపుల పేరుతో నిర్మలమ్మ విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు రావడంలేదు. ధరలు తగ్గడంలేదు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తిప్పలూ తగ్గడం లేదు. ఈ క్రమంలో బడ్జెట్‌ కొత్తగా ఉంటుందని ఎవరైనా భావించినా, ఊహించినా భంగపాటు తప్పదు.

ఈ నెల 31న మొదలయ్యే తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండవ విడత సమావేశాలు నెల రోజుల తర్వాత మార్చి 10 మొదలై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగుతాయి. గురువారం అంటే 30న అకిలపక్ష భేటీ యధావిధిగా ఉంటుంది. ఫలానా సమస్యలపై చర్చించాలని విపక్షాలు, సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని ప్రభుత్వం కోరడం ఏటా జరుగుతున్న తంతు కావడం విశేషం. అందువల్ల మనం అద్భుతాలు సృష్టిస్టారని అనుకోవడానికి లేదు. ప్రధానంగా విపక్షం కూడా పెద్దగా సీరియస్‌గా ఉండడం లేదు. వారికి పదవులు, గద్దెనెక్కే వ్యూహాలపై ఉన్న ధ్యాస, ఆలోచన ప్రజల సమస్యలపై ఉండడం లేదు. అందుకే చిన్నచిన్న సమస్యలను పెద్దవిగా చూపుతూ ఆందోళనలుచేయడం, వాకౌట్లు చేయడం, సమావేశాలను వాయిదా వేయించడం వంటి విన్యాసాలతో సరిపుచ్చుతున్నారు. ఇకపోతే తొలివిడత సమావేశాలు ప్రారంభం రోజున అంటే 31న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసగిస్తారు. ఇదికూడా ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

మర్నాడు, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 2025- 26 కు వార్షిక బడ్జెట్‌ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టడం ఒక విశేషం అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ కావడం మరో విశేషంగా చూడాలి. ఇవన్నీ కూడా యాంత్రికంగా సాగుతున్న తంతుగానే చూడాలి. వీరు బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం, బాగుందని చంకలు గుద్దుకోవడం, బాగోలేదని విపక్షాలు విమర్శించడం కూడా యథాలాపంగా జరిగిపోతూ ఉంటుంది. అందుకే పార్లమెంట్‌ సమావేశాల పట్ల రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సామాన్యులలో కూడా ఏయేటికాయేడు ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలను చర్చించి, పరిష్కార మార్గాలు చూపించవలసిన పార్లమెంట్‌ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని పార్లమెంట్‌ గురించి గొప్పలు చెబుతున్న నేతలు కావచ్చు, అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా పార్లమెంట్‌కు తగిన గౌరవం ఇవ్వడం లేదు.

ఏదో మొక్కుబడి తంతుగా, సమావేశాలు నిర్వహించడమే కానీ, పద్ధతిగా, ప్రజాస్వామ్య బద్ధంగా సభను నిర్వహించాలనే ఆలోచన, ఇరుపక్షాల్లోనూ కనిపించడం లేదు. అందుకే బడ్జెట్‌ సమావేశాలే కాదు..ఎప్పుడు సమావేశాలు జరిగినా మమ అనిపించేస్తున్నారు. గత శీతాకా పార్లమెంట్‌ సమావేశాలు కూడా ఇలాగే ముగించేశారు. అంబేడ్కర్‌న అమిత్‌ షా అవమానించాలన్న నెపంతో కాంగ్రెస్‌ నానా యాగీ చేసిన సంగతి దేశం మరచిపోలేదు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు, ప్రారంభమవుతున్నాయని అంటే, సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు వస్తాయి, ప్రజాసమస్యలు ఏ మేరకు చర్చకు వస్తాయి, అనే చర్చ ఒకప్పుడు జరిగేది. అధికార పార్టీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దం అయి వచ్చేది. ఇప్పుడా శ్రమ ఇరువర్గాలకు లేకుండా పోయింది. బడ్జెట్‌ సమావేశాలు అనగానే ధరలు తగ్గిస్తారా, పెట్రోల్‌పై సుంకాలు ఎత్తేస్తారా, ఇనకమ్‌ ట్యాక్స్‌ స్లాబులు తగ్గుతాయా అని చూస్తుంటారు. కానీ ఇవేవీ పట్టడం లేదు. అంతెందుకు ఇవన్నీ చర్చించడానికి అసలు పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయా అన్నదే అనుమానం.

ఎందుకంటే విపక్షాలు ఏదో ఒక గొడవను ముందుకు తీసుకుని వచ్చి బాయ్‌కాట్‌ చేయడం అలవాటు చేసుకున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరవాత నుంచి ఏమో గానీ మన్మోమన్‌ నాటి నుంచి నేటి మోడీ వరకు పార్లమెంట్‌ సమావేశాలు, దేశంలో రాజకీయాలు దిగజారయని చెప్పడానికి సంకోచించాల్సిన పనిలేదు. సమావేశాలు జరిగినప్పుడల్లా ప్రజాధనం వృథా కావడం మినహా మరో ప్రయోజనం కానరావడం లేదు. దిగజారుతున్న పార్లమెంట్‌’ ప్రమాణాలకు గత పార్లమెంట్‌ సమావేశాలన్నీ కళ్లకు కట్టాయి. అందుకే ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాల్లో ఏదో పొడుస్తారని అనుకోవడానికి లేదు. పార్లమెంట్‌ సమావేశాల సమయం వృథా కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. దీనికి పార్లమెంట్‌ సభ్యులు సమాధానం చెప్పాలి. ప్రజలకు జవాబుదారీతనం లేని ప్రజాస్వామ్యం అవసరమా అన్న చ ర్చ చేయాలి. పార్లమెంట్‌ సభ్యులను రీకాల్‌ చేయగలిగేలా రాజ్యాంగం ఉండాలి. ప్రజా ధనం వృధా చేయడం, వరుసగా కొందరే పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నిక కావడం వంటివన్నీ పోయినప్పుడే మన దేశం బాగుపడగలదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News