ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్‌

  • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలే ప్రోత్సహిస్తాం
  • ఇది సినిమా షూటింగ్‌లకు అద్భుతమని చెప్పిన నటుడు చిరంజీవి

రంగారెడ్డి, జనవరి 28: ప్రకృతి రమణీయతకు మారుపేరుగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏటా కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నామని అన్నారు. తెలంగాణను ప్రకృతివనంగా మార్చాల్సి ఉంది. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తాం. త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం అని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్‌ పీరియం పార్కులో రూ.లక్ష నుంచి రూ.3.5కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.

రాందేవ్‌రావ్‌ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్‌ పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్‌ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. ‘అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం అన్నారు. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉంది. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.. అనంతరం నటుడు చిరంజీవి మాట్లాడుతూ రాందేవ్‌ను కొనియాడారు.

‘పొద్దుటూరు ప్రదేశం నాకు ముందే తెలుసు. నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రాందేవ్‌ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మన హైదరాబాద్‌లోనే ఇలాంటి మొక్కలను రాందేవ్‌ తీసుకురావడం అభినందనీయం. ఆయన వ్యాపారవేత్తగా కాకుండా కళాకారుడిగా కనిపించారు‘ అని చిరంజీవి అన్నారు. ఎక్స్‌పీరియం పార్కు హైదరాబాద్‌కు తలమానికం అవుతుందని, ఒక కళాఖండంగా మిగిలిపోతుందని చిరంజీవి అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి మొక్కలు, కళాకృతులు చూస్తుంటాం. ఇండియాకు తీసుకెళ్తే బాగుండని అనిపించేది. ఇక్కడ హైదరాబాద్‌ శివారులో అవి లభిస్తున్నాయంటే, చాలా ఆనందంగా ఉంది. మా ఇంటి దగ్గర నేను రోజూ కూర్చొనే ప్రదేశంలో బయటకు కనపడకుండా ఫెన్సింగ్‌లా డిజైన్‌ చేయమంటే, రాందేవ్‌ అద్భుతంగా చేసి ఇచ్చారు. నా ఇంటి చుట్టూ చాలా చక్కని చెట్లు పెట్టుకున్నా. రాందేవ్‌ ’కొత్తగా మొక్కలు వచ్చాయి చూస్తారా’ అని అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు వాటి ధరలు వేలు, లక్షల్లో ఉండేవి. ఇప్పుడు కోట్లలో ఉంటున్నాయి.

అసలే నా సంపాదన అంతంత మాత్రంగా ఉంది. కొనలేనేమో అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రితో ఇక్కడకు వచ్చి, చూస్తే ఇవన్నీ కొనేయాలనిపిస్తోంది‘ ‘ఇలాంటి వాటిని పెట్టాలంటే వ్యాపార దృక్పథం ఉంటే సరిపోదు. అందుకే రాందేవ్‌లో ఒక ఆర్టిస్ట్‌ను చూస్తా. మొక్కలపై అంత ఇష్టం లేకపోతే దాదాపు పాతికేళ్లు ప్రయోగాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న అరుదైన మొక్కలను సైతం ఇక్కడకు తీసుకొచ్చి, ఇది సాధ్యమే అని నిరూపించారు. ఎక్స్‌పీరియంలోని శిలాకృతులు మన హైదరాబాద్‌కు అందం తీసుకొస్తాయి. డబ్బులు, స్థలం ఉంటే ఎవరైనా రియల్‌ ఎస్టేట్‌ చేద్దామని అనుకుంటారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని, పెద్ద మల్టీస్టోర్‌ బిల్డింగ్‌ కడితే, తరాలు నిలిచిపోతుంది. కానీ, రాందేవ్‌ తన మదిలో ఉన్న దాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చారంటే నిజంగా హ్యాట్సాప్‌. ’ఇది షూటింగ్స్‌కు ఇస్తారా రాందేవ్‌’ అని అడిగితే, ’ఫస్ట్‌ విూ మూవీ షూట్‌ అయితే ఇస్తా’ అన్నారు.

ఇప్పుడు కొత్త హీరోయిన్‌ను తీసుకొచ్చి స్టెప్పులు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందో. వచ్చే శీతాకాలంలో చూద్దాం. ఈలోగా వర్షాలు పడి, మరింత పచ్చదనం పెరుగుతుంది. ఒకట్రెండు ఏళ్లలో కంటికి ఇంపుగా ఉంటుంది. ప్రభుత్వం కూడా రాందేవ్‌ ఆలోచనలకు సహకారం అందించి, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఎక్స్‌పీరియం హైదరాబాద్‌కు అద్భుతమైన ల్యాండ్‌ మార్క్‌ అవుతుంది. హైదరాబాద్‌ ఇల్లు అనుకుంటే, ఇంట్లో చక్కని పెయింటింగ్‌ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు ఎక్స్‌పీరియం అలాంటిది‘ అని చిరంజీవి అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News