- తాత్కలిక ఉపశమనం కోసం ఎత్తులు వేస్తున్నారా
- జగన్తో దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం
అమరావతి, జనవరి 28: అధికారం ఉంటే దుర్యోధనుడిలా విర్రవీగడం.. అధికారం లేకుంటే పాండవుల్లా అజ్ఞాతవాసం చేయడం ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తున్న ధోరణి. మరో ఐదేళ్ల వరకు రాజకీయాలకు దూరంగా ఉండడం మేలన్న భావనలో కొందరు..అధికార పార్టీలో చేరడంలో మరికొందరు కాలం వెళ్లదీస్తున్నారు. నిజానికి నిబద్ద రాకీయాలు,. నిజాయితీ రాజకీయాలకు కాలంచెల్లింది. ప్రజాసేవ ముసుగులో అందరూ చేసేది స్వార్థ వ్యాపారాలే తప్ప మరోటి కాదు. ఎపిలో ఇప్పుడు పలువురు రాజకీయ నేతల తీరు దీనికి అద్దం పడుతోంది. వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీఆనామ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. నిజానికి ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏడు మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన నాటి నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్రెడ్డి ఆయనను దూరం పెట్టారు. దీంతో ఆయన పార్టీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తూ వచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఒక దశలో భావించారు. అయితే జగన్రెడ్డి ఒత్తిడి తేవడంతో పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని కూడా విజయసాయిరెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి సేవలు అవసరమని భావిస్తే జగన్ మళ్లీ పిలుస్తారు. అధికారం వస్తే
అన్నీ తారుమారవుతాయని చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తనను దగ్గరకు రానివ్వదు కనుక భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలని కొన్ని రోజుల క్రితం ఆయన భావించారు. తనతో పాటు ఏడెనిమిది మంది రాజ్యసభ సభ్యులను తీసుకువస్తానని, పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి అర్జీ పెట్టుకున్నట్లు వార్తుల వచ్చాయి. అయితే కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా పార్టీలో చేర్చుకోలేమని విజయసాయికి తెగేసి చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత రాకుండా చూడడం సాధ్యం కాక పోవడంవల్లనే ఆయన తప్పుకున్నారని అంటున్నారు. జగన్రెడ్డిపై పెండింగ్లో ఉన్న అవినీతి కేసులలో అప్రూవర్గా మారితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి తాము క్లియరెన్స్ ఇస్తామని తెలుగుదేశం ముఖ్యులు ఆయనకు స్పష్టంచేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అవినీతి కేసులలో అప్రూవర్గా మారితే తనకు ముప్పు తప్పదని భావించిన విజయసాయి రెడ్డి.. మనసు మార్చుకున్నారని మరికొందరి ప్రచారంగా ఉంది. 2029 నాటికి చంద్రబాబు బతికుంటే అప్పుడు తాము అధికారంలోకి వచ్చి ఆయనను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు కూడా. బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరి తోక ముడిచారు. చంద్రబాబును తిడుతూనే జనసేనాని పవన్ కల్యాణ్ను కీర్తించారు. కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డితో విజయసాయికి పరిచయం ఏర్పడిన నాటి నుంచి ఆ కుటుంబానికి విధేయుడిగా ఆయన ఉండిపోయారు.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడిటర్గా తన తెలివితేటలను ఉపయోగించి క్విడ్ ప్రో కోకు తెర లేపారు. జగన్రెడ్డితో అనతికాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారు. మన దేశంలో రాజకీయ అధికారాన్ని మించిన అధికారం లేదు. అలాంటిది ఉన్న ఎంపీ పదవిని కూడా ఆయన ఎందుకు వదులుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్పై సీబీఐ, ఈడీ కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఢిల్లీ స్థాయిలో విజయసాయి తన వంతు కృషి చేశారని అంటున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు విధేయుడిగా మారిపోయారు. ఈ విధంగా స్వామి కార్యం, స్వకార్యం చక్కదిద్దుకుంటూ వచ్చారు. అయితే కుటుంబపరంగా, రాజకీయంగా సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన కొన్ని రోజులుగా మానసికంగా నలిగిపోయారని చెబుతున్నారు. ఇకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారి పాపాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మద్యం, ఇసుక, భూముల విషయాల్లో విజయసాయిరెడ్డి చేతివాటంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో ఇక లాభం లేదనుకున్న విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించి ఉంటారు. రాజ్యసభ్యుడిగా ఉన్నా జగన్కు అనుకూలంగా ఉండలి. అదికూడా లేకపోతే స్వేచ్ఛగా ఉండొచ్చన్న సూచలనతో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. మొత్తంగా మున్ముందు ఏ కేసు ఎలా ముందుకు వస్తుందో ఇప్పుడేచెప్పలేం.