- వీరి భాగస్వామ్యం లేకుండా అభివృద్ధిని ఊహించలేం
- ఎన్సిసి ర్యాలీలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ, జనవరి 27: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, వీరి భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్లో సోమవారం నాడు జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఎన్సీసీ డవలప్మెంట్కు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పనితీరు తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని మోదీ అన్నారు. 170 సరిహద్దు ప్రాంతాలు, సుమారు 100 తీరప్రాంత సరిహద్దులకు ఎన్సీసీసీ క్యాడెట్లు విస్తరించారని, తద్వారా ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ’ఒకే దేశం ఒకే ఎన్నికలు’పై డిబేట్ను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు కొనసాగిం చాలని, దేశ యువత భవిష్యత్తుకు ఏకకాలంలో ఎన్నికలు కీలకమని అన్నారు.
ప్రతి నెలలోనూ ఎన్నికలు జరుగుతూ పోతుంటే కాలేజీలు, విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సమయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. వికసిత్ భారత్’ ఉద్దేశాలపై ఎన్సీసీ క్యాడెట్లతో సహా దేశ యవత దృష్టిసారించాలని మోదీ కోరారు. దేశ వికాశంతోనే భారత్ అంతర్జాతీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. 2014లో 14 లక్షల మంది ఎన్సీసీ క్యాడెట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 20 లక్షలకు చేరుకుందని, వీరిలో 8 లక్షల మందికి పైగా మహిళలే ఉండటం గర్వకారణమని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్గా ఎన్సీసీ నిలవడం, డిజాస్టర్ మేనేజిమెంట్తో సహా అన్ని రంగాలకు ఎన్సీసీ సేవలు విస్తరిస్తుండటం ముదావహమని చెప్పారు.