లక్ష్యం దిశగా దేశం పయనం.. ఈ గణతంత్రం మనకు ప్రత్యేకం

  • విముక్తి ప్రదాతలను స్మరించుకునే సమయం
  • జాతికిచ్చిన సందేశంలో రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ,జనవరి 25: ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశం మొత్తం గర్వించదగిన సందర్భం ఇది. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని ఆమె అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ‘అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్‌ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన తరుణమిదని అన్నారు.. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం‘ అని రాష్ట్రపతి తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చింది.

మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నా మంటే స్వాతంత్యర్ర కోసం పోరాడిన యోధుల చలవే. అయితే ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవడం విచారకరం. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.. కాబట్టి ప్రతి ఏటా ఇదే రోజున రిపబ్లిక్‌ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు. లాహోర్‌ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్‌ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది.

ఆనాడు సుభాష్‌ చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్‌ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్‌ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేందప్రసాద్‌ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.

భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది. తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్‌ దర్బార్‌ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్‌ తర్వాత, ఆయన ఇర్విన్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటినుంచి ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్‌ చేరింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News