హైదరాబాద్, జనవరి 25: జలమండలి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ- హైదరాబాద్ స్పెషల్ డ్రైవ్” కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతోంది. జలమండలి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సిబ్బంది, అధికారులు సీవరేజ్ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు రోజూ చేపడుతున్నారు. ఒకవైపు రోజూ వారీగా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుకుంటూనే.. మరోవైపు స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటిదాకా 19,688 ప్రాంతాల్లో పనులు నిర్వహించారు. అందులో 2561 కిలో మీటర్ల మేర సీవరేజ్ పైపు లైన్, 2.03 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేశారు. స్పెషల్ డ్రైవ్ పై ఫోకస్ పెట్టి క్రమంగా విధులు నిర్వర్తిస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులను ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ అభినందించారు. డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ఏవైనా సమస్యలుంటే ఐటీ విభాగం అధికారుల సాయం తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల నూతన సీవరేజ్ పైపులైన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
సిబ్బంది పనితీరు, స్పెషల్ డ్రైవ్ పురోగతిపై సంబంధిత సీజీఎంలు, డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సూచించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ- హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి 90 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గతేడాది అక్టోబర్ 2 న స్వయంగా ముఖ్యమంత్రి, రవాణా శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమైంది. మొదట 90 రోజుల గడువుతో ఈ డ్రైవ్ ను ప్రారంభించారు. డిసెంబర్ 31 నాటికి మంచి ఫలితాలు వచ్చాయి. దీర్ఘకాలిక సమస్యలు సైతం పరిష్కారం అయ్యాయి. రోజూవారీగా వచ్చే ఫిర్యాదులు 30 శాతం వరకు తగ్గాయి. ఈ విషయాల్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి.. జలమండలి సిబ్బంది, అధికారులను ప్రశంసించారు. బోర్డు పనితీరు మెచ్చుకున్న ఆయన.. ఈ డ్రైవ్ ను మరో 90 రోజులు పొడిగించాలని సూచించారు. దీంతో మరో 90 రోజుల పాటు డ్రైవ్ గడువును పొడిగించి డీ-సిల్టింగ్ పనులు నిర్వహిస్తున్నారు.