చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదు: రోజా

అమరావతి, జనవరి 25: దావోస్‌ పర్యటన చేసిన చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా దండగే అయ్యాయంటూ వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలు లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వస్తే.. చంద్రబాబు ఉత్తచేతులతో ఇంటిముఖం పట్టారని ఘాటుగా విమర్శించారు. పెట్టుబడిదారులు ఆసక్తిచూపకపోవడానికి లోకేశ్‌ పదేపదే చెబుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగమే కారణమన్నారు. ఏపీలో హింసాత్మక, కక్షపూరిత చర్యల కారణంగానే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని రోజా విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై మాజీమంత్రి రోజూ చురకలంటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆమె ఆరోపించారు. అధికారులపై అక్రమ కేసులుపెట్టి వేధిస్తుంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. రాష్ట్రంలో నిత్యం దాడులు,అత్యచారాలు ఎక్కువయ్యాయని.. నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని రోజా విమర్శించారు.

ఇలాంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరికి మాత్రం ఆసక్తి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని దుయ్యబట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని…రోడ్లపైనే నరుక్కుంటున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. కోట్లు ఖర్చుపెట్టి విమానాల్లో దావోస్‌ వెళ్లిన చంద్రబాబు,లోకేశ్‌ ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేకపోయారని రోజామండిపడ్డారు. రూ.20 కోట్లు ఖర్చు చేసి దావోస్‌ వెళ్లి ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చారన్నారు. ప్రత్యేక విమానాలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు కోట్లు ఖర్చు చేశారన్నారు. గతంలో జగన్‌ దావోస్‌ వెళ్లినప్పుడు లక్షా 20 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని….విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా రూ.13.5 కోట్లు పెట్టుబడులు పెట్టించారని రోజా గుర్తు చేశారు.ఇప్పుడు ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్‌లన్నీ గతంలో జగన్‌ తీసుకొచ్చినవేనని ఆమె గుర్తు చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ ఉండగా….చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను దావోస్‌ తీసుకెళ్లాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్‌కల్యాణ్‌ను దావోస్‌కి ఎందుకు తీసుకెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. దావోస్‌లో ఒక్కటంటే ఒక్క ఒప్పందం జరగకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఏడు నెలల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో లక్షా 32వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. ఏపీకి ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే కట్టు కథలు ఏపీ ప్రజలు విన్నారు గానీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు పట్టించుకోలేదని రోజా విమర్శించారు. వైఎస్‌ జగన్‌ పాలన చూసి అదానీ, అంబానీ, జిందాల్‌ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని.. చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని రోజా విమర్శించారు. పెట్టుబడులు తీసుకురాకుండా ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బృందం ఏపీలో అడుగుపెట్టిందని రోజా ప్రశ్నించారు.

దావోస్‌లో భారీ పెట్టుబడులు తెచ్చి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ఊదరగొడితే యువత ఆశగా ఎదురుచూసిందని రోజా అన్నారు. తెలంగాణ రూ.1.32 లక్షల కోట్లు, మహారాష్ట్ర 15.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయని రోజా తెలిపారు. దేశంలో అందరికన్నా సీనియర్‌ రాజకీయ నాయకుడినంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఒక్క రూపాయి ఒప్పందం కూడా చేసుకోలేదన్నారు. తన కుమారుడిని ప్రమోట్‌ చేసుకునేందుకు దావోస్‌ తీసుకెళ్లారు తప్ప.. పెట్టుబడులు సాధించడానికి కాదన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News