హైదరాబాద్, జనవరి 23: మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తిని బీఆర్ఎస్ పార్టీ నగర మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, ఎంఎల్ఏ లు మాధవరం కృష్ణారావు, వివేకానంద, రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులతో పాటు పలువురు కార్పొరేటర్లు కలిశారు. హైదరాబాద్ మహానగరంలో ప్రజలు శానిటేషన్, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను, కొంతమేర పూర్తి చేసిన పనులను కూడా ఈ ప్రభుత్వ హయాంలో చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై పిర్యాదు చేశారు.
ప్రజా సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిందుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కమిషనర్ స్పందించలేదని పలువురు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల అర్హుల జాబితా తయారీలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమాలకు తావులేకుండా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించి వారికి అందజేయాలని కోరారు. అనంతరం కూకట్ పల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పెండింగ్ పనులపై ఇప్పటికే పలుమార్లు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదనీ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా కార్పొరేటర్లు వినతి పత్రాలు అందజేశారు.