- ఆర్థిక ప్యాకేజీతో తప్పని ప్రైవేటీకరణ ముప్పు
- కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వివరణ
భీమవరం, జనవరి 23: విశాఖ సెటిమెంటును కాపాడుతూ.. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చిందని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను మినహాయించి, ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన విూడియా సమావేశంలో శ్రీనివాసవర్మ మాట్లాడారు. ‘ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించే అవకాశం కలిగినందుకు ఆంధ్రుడిగా గర్విస్తున్నా. దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోదీ లక్ష్యం. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ జీతాలే రూ.230 కోట్ల వరకు పెండిరగ్లో ఉన్నాయి. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిస్తాం.
ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కు తగ్గి, భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొందరు దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో భారీ ప్యాకేజీ కూడా ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం జరగదు. నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాక అప్పగించమని సెయిల్ చెప్పింది. ఈ నెలాఖరులోగా ముడిసరకు తీసుకొచ్చి, ఉత్పత్తి ప్రారంభిస్తాం. ఆగస్ట్ నెలాఖరుకి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్ ను నష్టాల బాటలోంచి లాభాల్లోకి తీసుకొస్తాం. సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయి. దేశంలోని జిందాల్, జేఎస్డబ్ల్యూ ప్లాంట్ వంటి సొంత గనులు లేవు.. అయినా లాభాల్లో ఉన్నాయి. సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదని శ్రీనివాసవర్మ అన్నారు.