హైదరాబాద్, జనవరి 23: తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రహదారులు మంజూరు చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు జాతీయ రహదారులను కూడా విస్తరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యతం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. మరికొన్ని ప్రాంతాల మధ్య కొత్తగా రహదారులు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రహదారులు నిర్మిస్తుండగా.. మరికొన్ని రోడ్లను కేంద్రం నిర్మిస్తోంది. తాజాగా తెలంగాణలో మరో నేషనల్ హైవే నిర్మాణంపై కీలక హామీ వచ్చింది. చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్నసిరిసిల్ల వరకు నేషనల్ హైవే నిర్మించాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. ఈ విషయంపై స్థానికులు పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు కూడా సమర్పించారు. తాజాగా.. ఆ నేషనల్ హైవేపై మెదక్ ఎంపీ రఘనందన్ రావు కీలక హామీ ఇచ్చారు.
జాతీయ రహదారి నిర్మాణం విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. స్థానిక ప్రజల ఆంకాంక్షల మేరకు రోడ్డు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పలువురు ఈ విషయంపై ఎంపీకి వినతిపత్రం అందించారు. చేగుంట -%సిరిసిల్ల మధ్య నేషనల్ హైవే చేపడితే రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన వేములవాడకు ఈజీగా చేరుకోవచ్చునని అన్నారు. వేములవాడ- హైదరాబాద్ మధ్య కూడా దూరం తగ్గుతుందని చెప్పారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘునందన్ రావు ఈ రహదారి అంశాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నేషనల్ హైవే మంజూరుకు తాను శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారి నిర్మాణంపై చర్చిస్తానని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. కాగా, ఎంపీ ప్రకటనతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణం కోసం పోరాడుతున్నామని చెప్పారు. త్వరితగతిన రహదారి మంజూరైతే.. ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు.