అమృతత్వాన్ని సంతరించుకున్న జీవనదులు

  • మహాద్భుతంగా సాగుతున్న కుంభమేళ
  • రాత్రివేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపేలా
  • పుణ్యతిథుల్లో హాజరుకానున్న రాష్ట్రపతి, ప్రధాని తదితరులు

ప్రయాగరాజ్‌, జనవరి 23: దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించు కుంటాయి. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. ఈ నదుల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని పురణాలు చెబుతున్నాయి. మన పూర్వీకులు కూడా ఇదే చెప్పేవారు. అందుకే నదుల్లో ఆయా సమయాల్లో పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఇప్పుడు కుంభమేళాలో కూడా నదీస్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతున్నారు. మహా కుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు అద్భుతంగా సాక్షాత్కరిస్తున్నాయి. రాత్రివేళల్లో మహాకుంభ మేళా దీపకాంతులతో అందంగా ముస్తాభైన నవ వధువులా కనిపిస్తోంది. మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వేదికగా జరుగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. జనవరి 13 ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ దాదాపు నలభై అయిదు రోజులపాటు జరుగుతుంది.

గంగమ్మతల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించింది. ఆ పాత్రకోసం దేవతలు- రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయట. దాంతో ఆ నాలుగు నదులూ అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వార్‌లోని గంగ, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ కారణంగా ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతుంటారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను రెండు రకాలుగా జరుపుతారు.

అవే అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా. అర్ధ కుంభమేళాని ఆరేళ్లకోసారి చేస్తారు. మహా కుంభమేళా పన్నెండేళ్లకోసారి వస్తుంది. ఈ పన్నెండేళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహా కుంభమేళానే. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మహా కుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. రాత్రివేళ మహాకుంభం మేళా ఏర్పాట్లు చూసేందుకు తరలివస్తున్నారు. రాత్రి పూట ఆకాశం నుండి తీసిన మహా కుంభమేళ ఫోటోలు నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఆ దృశ్యం ఎంత అందంగా, మనోహరంగా ఉందో మాటల్లో చెప్పలేం. కళ్లతో చూడాల్సిందే..మహాకుంభమేళా ఏర్పాట్లు పగటిపూట మాత్రమే కాదు.. రాత్రిపూట కూడా ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా మిగిలిపోతుందనే చెప్పాలి.

’హర్‌ హర్‌ గంగే’ అనే నామం జపిస్తూ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారని, దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని యూపీ సీఎం యోగి వివరాలు వెల్లడిరచారు. అలాగే, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా ..ప్రముఖుల రాక పెరుగనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళాని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. జనవరి 27న జరిగే మహా కుంభమేళలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరుకానున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌ని సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో నిర్వహించే పలు ప్రధాన కార్యక్రమాలకు హాజరు కానున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 1న జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌ కూడా పాల్గొంటారని భావిస్తున్నారు.

జనవరి 27న హోంమంత్రి అమిత్‌ షా తన షెడ్యూల్‌ ప్రకారం మహాకుంభ్‌లో పాల్గొంటారు. ఆయన సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు. గంగపూజ నిర్వహించి అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు జనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌ రాజ్‌ ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరచడపై సీఎం అధికారులకు మార్గనిర్దేశర చేశారు. ఈ సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచిస్తూ అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News