మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ మరోమారు సిద్దంగా ఉన్నారు. ఎప్పటిలాగే ఈ సారి బడ్జెట్ సమావేశాలు ఉంటాయా లేక మరేమైనా అద్భుతాలు ఉంటాయా అన్నది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, నిరుద్యోగం, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటివి దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార, విపక్షాలు బాధ్యతగా ముందుకు సాగాల్సిన సమయమిది. పార్లమెంట్ అనగానే విమర్శలు, ప్రతి విమర్శలతో కాలయాపన చేయడం, వాకౌట్లు చేయడం, ఆందోళనలకు దిగడం సరికాదు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అవసరాల మేరకు ప్రతిపక్షాలు ఆయా అంశాలపై చర్చలు జరిగి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేయాలి. పార్లమెంటులో ఒక్కో సమస్యపై చర్చకు ఒక్కో విధానం ఉంది. అంతేతప్ప తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా విపక్షం వ్వయహరించరాదు. ఇక అధికార పక్షం కూడా తామంతా గత పదేళ్లుగా బ్రహ్మాండంగా పనిచేశామని, భారత్ను ఉద్దరించామన్న ధోరణి నుంచి బయటపడాలి. ప్రజలు ఏం కోనుకుంటున్నారో గుర్తించాలి.
అంతర్గత చర్చలకు అవకాశం ఇవ్వాలి. వికసిత భారత్ లక్ష్యంగా పదేళ్లుగా మోడీ నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతున్నా..ప్రజల్లో మాత్రం వికసిత జీవితాలు కనిపించడం లేదు. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కార్పోరేట్లకే బిజెపి అనుకూలం అన్న ప్రచారం బలంగా ఉంది. పేదల అభివృద్ది అటేనే దేశ అభివృద్ధి. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందంటే పేదలు బాగుపడాలి. కానీ పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. ఫ్రీ రేషన్తో ఆహార సమస్య తీరిందని పేర్కొనడంతోనే దేశం ఏ మేరకు అభివృద్ది చెందిందో చర్చించాలి. ధరల పెరుగుదలను చూస్తుంటే ప్రబుత్వాలు ఎంత అధ్వాన్నంగా పాలన చేస్తున్నాయో గమనించాలి. నిత్యాసవర ధరలు, ఔషధాల ధరలు అడ్డదిడ్డంగా పెరుగుతున్నాయి. గ్రావిూణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని చెప్పడం కన్నా, గ్రామాలకు వెళ్లి నిరూపించాలి. ఎంపిలు డూడూ బసవన్నల్లాగా తలూపకుండా సమస్యల పై చర్చించాలి.
కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు ధరలు, సకాలంలో రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఇన్ని సమస్యలను చర్చించకుండా బడ్జెట్లో అంతా బాగుందని చెప్పడం ద్వారా భారత్ వెలిగిపోతోందని అంటే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరని గుర్తించాలి. అందుకే బడ్జెట్లో విస్తృత చర్చ జరగాలి. అలాగే సామాన్యులు బతకడమెలా అన్నది పాలకులు ఆలోచించినప్పుడే దేశ ఆర్థికవృద్ది సాధ్యం కాగలదు. సామాన్యుడు తనకుతానుగా బతకగలిగి నప్పుడే నిజమైన అభివృద్దికి గీటురాయిగా చూడాలి. వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించ బోతుందని మోడీ సహా నేతలంతా పేర్కొంటూ..రాజకీయ పబ్బం గడుపుతున్నారు. విజన్ డాక్యుమెంట్ల పేరుతో ఇంకెంతోకాలం వంచించలేదు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం, అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్దంచేయాలి. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం అని మోడీ చెప్పారు.
అలాగే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని చెప్పారు. నిజానికి అభివృద్ది జరిగివుంటే ఈ దుస్థితి ఎందుకని ప్రశ్నించుకోవాలి. ప్రజలు తిండిగింజలను కొనుక్కునే పరిస్థితిలో లేరని చెప్పకనే చెప్పారు. పేద మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కాల ఎండమావిగా మారింది. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. అంతెందుకు జిఎస్టీ మోతలను సంస్కరించాలను కోవడం లేదు. ఆదాయపన్నును పరిశీలించడం లేదు. ఇవన్నీ కూడా బడ్జెట్లో చర్చించాలి. కేవలం లెక్కలు చెప్పి బుకాయించడం కుదరదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుర్తించాలి. అధికారులు వేసే లెక్కలకు తలూపడం కాకుండా క్షేత్రస్థాయి సమస్యలను చర్చించినప్పుడే వికసిత భారత్ సాధ్యం కాగలదు. జిఎస్టీ వసూళ్లు నెలకు లక్షా 40 వేల కోట్ల నుంచి లక్షా 70వేల కోట్ల వరకు చూసి మురిసిపోతున్నారు.
ప్రజలు స్వచ్చందంగా పన్నులు కట్టలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తాయని ఆశించినా, జిఎస్టీ లాంటి పన్నులు మోత మోగిస్తున్న తీరు ప్రజల దివాళాను సూచిస్తోంది. దేశ ప్రజలు భవిష్యత్పై ఆశతో జీవిస్తున్నారు. మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో బతుకుతున్నారు. అలాంటి వారికి బడ్జెట్ స్వాంతన కావాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. రైతులకు కనీస మద్దతు ధరలు అన్నవి రావాలి. బియ్యం, ఉప్పు, పప్పుల ధరలు మాత్రం ఏటికేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం అండలేకుండానే జీవించగలగాలి. కానీ ఈ పదేళ్లలో అలాంటి అవకాశాలు లేకుండా చేశాయి. బ్యాంక్ వడ్డీ రేట్లు దారుణంగా ఉన్నాయి. భూములు, సిమెంట్, స్టీలు ధరలను అడ్డం పెట్టుకుని బిల్డర్లు దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బడ్టెట్ పద్దుల్లో చర్చించాల్సి ఉంది. బడ్జెట్ పద్దులు ప్రజలను ఆదుకునేలా ఉండాలి. అందమైన ఎసి గదుల్లో కూర్చుని ఆలోచిస్తే ఎన్నటికీ అంటే 2047 నాటికి కూడా ప్రజల బతుకులు బాగుపడవని గుర్తించాలి. అప్పుడే సామాన్యులకు అండగా ప్రభుత్వం ఉందన్న నమ్మకం కలుగుతుంది.