ట్రంపరితనంతో.. లాభమెంత.. నష్టమెంత?

ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ అమెరికన్లకు మాత్రం నచ్చి తీరుతుంది. అమెరికా ఫస్ట్‌ అన్న ఆయన నినాదం బాగా ప్రాచుర్యం పొందింది. ఏ పాలకుడైనా తమ దేశ ప్రయోజనా లను మాత్రమే చూస్తారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ట్రంప్‌ కూడా ఇప్పుడు అదేవిధమైన విధానాలతో ముందుకు సాగుతున్నారు. కాకపోతే అమెరికాపై చాలా మంది ఆధారపడి బతుకుతున్నందున వారికి ఇవి నచ్చకపోవచ్చు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పిల్లలను కని, వారిని అమెరికా పౌరులు చేస్తామంటే ఎవ్వరికైనా మండుతుంది. ట్రంప్‌కు అక్కడే మండింది. అందుకే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలన్నది ఆయన మొదటినుంచి పట్టుబడుతున్న వ్యవహారమే. హెచ్‌-1 వీసాల విషయంలోనూ ముఖ్యంగా భారతీయుల్లో ఆందోళన నెలకొంది. మాకు దక్కాల్సిన ఉద్యోగాలను ఎగరేసుకుని పోతున్నారని అమెరికన్లు ఎప్పటి నుంచే గగ్గోలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో బాగా ప్రాచుర్యం పొందినవే.

అమెరికాకు అనుగుణంగా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనకు అనుకూలంగా లేవు కనుక మనం భాధపడుతున్నాం. అమెరికా ఫస్ట్‌ అన్న ఆయన నినాదం మేరకు నిర్ణయాలు ఉంటాయని తెలియచేస్తున్నారు. అలా అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసీ చేయగానే ట్రంప్‌ తను గతంలో ప్రకటించిన మేరకు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒకటి- పారిస్‌ ఒప్పందం నుంచి మళ్లీ బయటకు రావడం. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతానంటూ తొలిరోజు ప్రసంగంలో దేశ ప్రజలకు హావిూ ఇచ్చిన ట్రంప్‌.. భూతాపానికి ముకుతాడు వేసేందుకు 190కి పైగా దేశాలు ఒక్కతాటిపైకి వచ్చి కుదుర్చుకున్న ఒడంబడిక నుంచి వైదొలగడం మిగతా ప్రపంచ దేశాలకు నచ్చలేదు. అందుకే అమెరికాకు తొలిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్‌ ఈ ఒప్పందంనుంచి వైదొలగడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి. దూకుడుతనానికీ, దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు.

అలా ఉండటమే తనకు రెండోసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు. కీలకమైన పారిస్‌ ఒప్పందం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న బైడెన్‌, తాను అధికారంలోకి వచ్చాక 2021లో మళ్లీ ఒప్పందంలో అమెరికాను చేర్చారు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా వాదించే ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడు కాగానే ఈ ఒప్పందాన్ని కాలరాచేందుకు ఉద్యుక్తుడయ్యారు. అంతేకాదు, కొవిడ్‌ వ్యాప్తి సమయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందనే ఆగ్రహంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల అమెరికాకు వచ్చే లాభం ఎంతన్నది ఆయన చేస్తున్న వాదనగా ఉంది. కృత్రిమ మేధ విస్తరిస్తే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, బైడెన్‌ ప్రభుత్వం దీని విస్తరణపై విధించిన ఆంక్షలను తాజాగా ట్రంప్‌ తొలగించారు. కీలకమైన అంశాలపై లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలు.. ఏవీ లేకుండా వచ్చీరాగానే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం ఆయన తొందరపాటుకు నిదర్శనమనే చెప్పాలి.

పదవిలోకి రాకముందే హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్దానికి ముగింపు పలికారనే ఘనతను ట్రంప్‌ దక్కించుకున్నారు. ఆయన హెచ్చరికలవల్లే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ దిగి వచ్చారని విశ్వసించేవారు ఎంతోమంది ఉన్నారు. రష్యా -ఉక్రెయిన్‌ యుద్దానికి కూడా ట్రంప్‌ చరమాంకం పలుకుతారని ఆయన అనుయాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యుద్ధ విరమణకు కృషి చేస్తూ, మరోవైపు గ్రీన్‌లాండ్‌నూ, పనామా కాలువనూ స్వాధీనం చేసుకుంటామంటూ తొలిరోజే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. తొలిసారి మాదిరిగానే ఈసారి కూడా ట్రంప్‌ ప్రసంగం దూకుడుగా, తన మద్దతుదారులు, దేశప్రజలలో ఉత్సాహం నింపేదిగా సాగింది. ’అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది. మునుపెన్నడూ లేనంత దృఢమైన, పటిష్ఠమైన, అసాధారణమైన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతా’నంటూ ఆయన అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మొదటిసారికంటే ఈ తడవ మరింత శక్తిమంతమైన నేతగా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీ బలం రిపబ్లికన్‌ పార్టీదే కావడం ఇందుకు కారణం. భారత్‌,అమెరికా ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే మోడీ- జో బైడెన్‌ హయాంలో ఇరుదేశాల మధ్య బంధం మున్నెన్నడూ లేనంతగా బలోపేతమైందనేది జగద్విదితం. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడన్న నానుడిని నిజం చేస్తూ ఇరు దేశాలకూ పక్కలో బ్లలెంలా మారిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు బలపడటానికి కారణమైంది. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీ సుంకాలు విధిస్తోందని అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌, భారత్‌ ఉత్పత్తులపైనా అదే విధంగా సుంకాలు విధించే అవకాశం ఉండవచ్చు. అంతమాత్రానికే, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీన పడతాయని భావించరాదు. ట్రంప్‌ విదేశాంగ విధానంలో కొంత గందరగోళం ఉంటుందన్నది విస్పష్టం. అమెరికాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదిగుతున్న చైనా మెడలు వంచడం అనుకున్నంత సులభమేవిూ కాదు. ఏదేమైనా ఎవరి విధానాలు వారివి. వారికి అనుగుణంగానే ఇతర దేశాలు నడుచుకోవాలి. అవి మనకు ఉపయోగమా కాదా అన్నది ముఖ్యం కాదు. అక్కడి చట్టాలు, పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోగలమా లేదా అన్నదే ముఖ్యం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News