పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన ప్రగతి

  • కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్‌ ఎనర్జీ ఏకైక పరిష్కారం
  • సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడులే లక్ష్యం
  • దావోస్‌ వేదికగా చర్చల్లో మంత్రి లోకేశ్‌ స్పష్టీకరణ

దావోస్‌, జనవరి 21: ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్‌ వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. ’పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్‌’ అంశంపై సమావేశంలో చర్చించారు. పోర్చుగల్‌ ప్రధాని, జోర్డాన్‌ క్వీన్‌, యునెస్కో సైంటిస్ట్‌ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తున్నాం. కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్‌ ఎనర్జీ ఏకైక పరిష్కారం. సుస్థిర శక్తి వనరుల్లో ప్రపంచ అగ్రగామి కావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ గణనీయమైన ప్రగతి సాధించింది. భారత ప్రభుత్వం ఇటీవల ఏపీలో నాలుగు సోలార్‌ పార్కులు ప్రకటించింది. హరిత, ఇంధన పర్యావరణ వ్యవస్థ స్థాపనే ఏపీ లక్ష్యం. ఇందుకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ ప్రకటించాం అని అన్నారు.

పునరుత్పాదక శక్తి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చాం. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలు గుర్తించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఆర్‌ఈఎస్‌పీ ప్రాజెక్టు ఏపీలో ఉంది. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పునరుత్పాదక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం‘ అని లోకేశ్‌ తెలిపారు. బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రాన్సిస్‌తో లోకేష్‌ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ (ఉఅఅ) ఏర్పాటు చేయాలని లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలంతో పాటు ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్‌ఫోర్స్‌లో 25 శాతానికి పైగా తెలుగువారే ఉన్నారన్నారు. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్‌-టెక్‌ హబ్‌గా ఏపీని మార్చడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.

అన్ని విధాలుగా అనుకూలతలు కలిగిన ఏపీలో కంపెనీ తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కోరారు. ఏఐ, నెట్‌వర్కింగ్‌, సైబర్‌ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని ప్రాన్సిస్‌ను కోరారు. లోకేశ్‌ విజ్ఞప్తిపై ఫ్రాన్సిస్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కంపెనీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫిలిప్‌ మోరిస్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా వైస్‌ఛైర్‌పర్సన్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో స్మోక్‌ ఫ్రీ సిగరెట్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఏపీలోని గుంటూరు అనువుగా ఉంటుందన్నారు. పొగాకు బోర్డు, రైతుల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఏపీ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫిలిప్‌ మోరిస్‌ సంస్థ తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News