- ప్రమాణం చేయించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
- తొలుత ప్రమాణం చేసిన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్
- హాజరైన విదేశాంగ మంత్రి జైశంకర్.. ముఖేశ్ అంబానీ
వాషింగ్టన్, జనవరి 20: అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్, తన బైబిల్ను చేతిలో పట్టుకొని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ అతిథులతో క్యాపిటల్ హిల్ రోటుండా కిటకిటలాడింది.
ప్రమాణస్వీకారోత్సవానికి ముందు జో బైడెన్ను కలిసేందుకు ట్రంప్ శ్వేత సౌధానికి వెళ్లగా.. ఆయనకు బైడన్ దంపతులు సాదరస్వాగతం పలికారు. పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం శ్వేతసౌధం నుంచి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి జో బైడెన్, ట్రంప్ ఒకే వాహనంలో వెళ్లారు. భారత్ తరఫున ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున హాజరైన జైశంకర్.. ట్రంప్నకు మోదీ రాసిన లేఖను అందజేసారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకార వేడుకకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ దంపతులు సైతం హాజరయ్యారు.
పలువురు అమెరికా మాజీ అధ్యక్షులు సతీసమేతంగా ఈ వేడుకకు విచ్చేశారు. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, లారా బుష్ తదితరులు విచ్చేశారు. బరాక్ ఒబామా హాజరైనప్పటికీ మిచెల్లీ ఒబామా మాత్రం ఈ వేడుకకు రావడంలేదని ముందే ప్రకటించారు. అమెరికా సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది జడ్జిలు ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రంప్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు వివేక్ రామస్వామి, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ తదితరులు పాల్గొన్నారు.