- క్రమశిక్షణా కమిటీకి వివరాలు ఇచ్చా
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
అమరావతి, జనవరి 20: తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు…అందుకే వాస్తవాలన్నీ క్రమశిక్షణా కమిటీకి వివరాలు ఇచ్చానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా, రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం విూడియాతో ఆయన మాట్లాడారు. ‘సోషల్ విూడియాలో వచ్చేది వేరు.. జరిగిన వాస్తవం వేరు. కంచె తొలగింపు ఘటన యాదృచ్చికంగా జరిగింది. కంచె ఉన్న విషయం అక్కడికి వెళ్లే వరకు తెలియదు. నాపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ నాతో కలిసి పనిచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లను ఎవరూ దూరం పెట్టరు. తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు‘ అని కొలికపూడి అన్నారు. ఈ నెల 11న కొలికపూడి.. ఎ.కొండూరు మండలం గోపాలపురంలోని తెదేపా గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆ గ్రామంలో రాంబాబుకి, ఆయనకు వరుసకు సోదరుడయ్యే..
వైకాపా నాయకుడు భూక్యా కృష్ణకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదా ఉంది. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు తన స్థలంలోనే వేశారని.. వివాదం తేలేవరకు రోడ్డుని ఎవరూ వినియోగించడానికి వీల్లేదని కృష్ణ దానిపై కంచె వేశారు. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఆ రోడ్డు దగ్గరకు వెళ్లి కృష్ణ, ఆయన భార్య భూక్యా చంటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి తన భర్తను, తనను కొట్టారంటూ… భూక్యా చంటి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తెదేపాలోని మెజార్టీ వర్గాలు కూడా ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నాయి. దీంతో సోమవారం ఎమ్మెల్యేను క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిపించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణకు కొలికపూడి వివరణ ఇచ్చారు.