హైదరాబాద్, జనవరి 17: మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలోని గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద ఆర్ యుబీ నిర్మాణ పనుల కోసం సమీపంలో ఉన్న స్ధల యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హమీ ఇచ్చారు. శుక్రవారం ఆయన, గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్, జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి తదితర శాఖల అధికారు లతో కలిసి గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద పర్యటించి, సేకరించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌతంనగర్ ఆర్ యుబీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. దీని కోసం అవసరమైన స్ధలం సేకరణ విషయంలో నివాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా, అధికారు లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. అంతకు ముందు స్ధానికులు మాట్లాడుతూ.. ఇక్కడ ఆర్ యుబీ నిర్మాణంతో తమ ఇళ్లు కోల్పోవాల్సి వస్తుందని, తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మీరందరూ ఎంతో కష్టపడి సంపా దించిన డబ్బులతో ఇళ్ళు నిర్మించుకున్నారని, మీ ఇళ్లకు నష్టం వాటిల్లకుండా, సాధ్యమైనంత వరకు స్ధలాలు కోల్పోకుండా ఆర్ యుబీ నిర్మాణానికి స్ధలం సేకరిస్తామని భరోసానిచ్చారు. గత 2 దశాబ్దాల కాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తాము ఆర్ యుబి నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీని కోసమే గతంలో అనేకసార్లు రైల్వే, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించానని ఆయన చెప్పారు. ఆర్ యుబీ నిర్మాణానికి ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే, స్ధానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో రైల్వే, ఇంజనీరింగ్, విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు