- ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో నేతల భేటీ
- రాహుల్ పర్యటన, పార్టీ పదవులపైనా చర్చ
- వివరాలు వెల్లడించిన పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, జనవరి 15: తెలంగాణలో రాహుల్ పర్యటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో చర్చించారు. పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్తో కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ‘సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ ఉండే అవకాశముంది. ఈ నెలాఖరులోపు నామినేటెడ్, కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ ఉంటుంది.
కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించాం. ప్రజల్లో ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవులు‘ ఇస్తాం అని మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సవిూక్ష చేపట్టారు. కేసీ వేణు గోపాల్ మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘సంవిధాన్ బచావో‘ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఈ నెలాఖరు కల్లా నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అంతేకాకుండా.. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నిజమైన కార్యకర్తలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ‘ (డీసీసీ) అధ్యక్ష పదవులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించి, సిఫార్సు చేసే వారికే ప్రాధాన్యతనిచ్చి, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనుంది అధిష్ఠానం. వచ్చే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా సమిష్టిగా సన్నద్దం కావాలని నిర్దేశం చేశారన్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు పై అధిష్ఠానం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.