ఎపిలో కాంగ్రెస్‌ బలోపేతంపై చర్చించా

  • ఇందిరాభవన్‌లో వైఎస్‌ పాదయాత్ర ఫోటోలు
  • ఎంతగానో ఆకట్టుకున్నాయని షర్మిల పోస్ట్‌

న్యూఢిల్లీ, జనవరి 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై రాహుల్‌, వైఎస్‌ షర్మిల ఇద్దరూ చర్చించారు. అలాగే ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవంపై ఎక్స్‌ వేదికగా షర్మిల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగిన కార్యక్రమంలో షర్మిలా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్దఎత్తున హాజరయ్యారు. కాగా, ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలోని కోట్లా రోడ్డులో ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త కార్యాలయం ’ఇందిరా భవన్‌’ని అగ్ర నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ప్రారంభించడం సంతోషంగా ఉంది.

ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో నేనూ పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ఆరు అంతస్తుల భవనంలో 140 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రకు సంబంధించిన అద్భుతమైన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఫొటోలు కార్యాలయంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. పాదయాత్ర ఫొటోలు కొత్త కార్యాలయంలో పెట్టడం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. కొత్త ఏడాదిలో ప్రారంభించు కున్న ఈ నూతన భవనం నుంచే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ధీమా వ్యక్తమవుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నూతన భవనంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ భవనానికి ఇందిరాభవన్‌గా నామకరణం చేశారు.

ఈ వేడుకలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు. ఏపీకి చెందిన పలువురు నేతలు సైతం హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి సుమారు 400 మంది ఆహ్వానితులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఆరు అంతస్తులో ఆధునిక సౌకర్యాలతో ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని నిర్మించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News