- ఎంపి ధర్మపురి వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల అభ్యంతరం
- బహిరంగ లేఖ రాసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, జనవరి 15: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన సందర్భంగా తనపై ఎంపి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ.. కేంద్రం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం స్పందించారు. ఆ క్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగానే కాకుండా.. ఒక రైతుగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా.. పార్టీ, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తాను ధన్యవాదాలు తెలియజేశానని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి విూరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. ఆక్షేపణీయంగా ఉన్నాయంటూ ఎంపీ దర్మపురి అరవింద్కు తెలియజేశారు. ఈ స్థాయికి దిగజారి విూరు మాట్లాడతారని తాను ఊహించలేదని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ విూ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివని స్పష్టం చేశారు.