న్యూఢిల్లీ,జనవరి 15: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 9 కోట్లా రోడ్డులో ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కొత్త కార్యాలయాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కొత్త భవనానికి ఇందిరా గాంధీ భవన్గా పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల చీఫ్లు మొత్తం 400 మంది లీడర్లు పాల్గొన్నారు.
కాగా, గత ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డు 24వ నెంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే, ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు సొంత భవనాలను నిర్మించుకుంటున్నాయి. ఇక 2008లో దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్లో కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి కేంద్రం స్థలం కేటాయించింది. దీంతో 2009లో కార్యాలయం నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. 15 ఏళ్లుగా ఈ నిర్మాణ పనులు సాగాయి.