న్యూఢిల్లీ,జనవరి 15: వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా.. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇక గడువు సమీపిస్తుండటంతో రాజధానిలో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇప్పటికే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ సీఎం అతిశీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
ఇవాళ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిరచనున్నారు.