టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా ఆయా ఆలయాల పూజారులు బ్రహ్మానందంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బ్రహ్మానందం సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఇక ఇవాళ గిద్దెపేరుమాండ్ల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.
ఆలయ పూజారి శంకర శర్మ.. బ్రహ్మానందం చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరీంనగర్లోని తమ బంధువుల ఇంటికి.. సంక్రాంతి పండుగకు వచ్చినట్లు బ్రహ్మానందం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయాలను కూడా సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయా ఆలయాల్లో బ్రహ్మానందం కనిపించే సరికి స్థానికులు షాక్కు గురయ్యారు. బ్రహ్మానందంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు కరీంనగర్ వాసులు ఆసక్తి చూపారు.