- ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల హాజరు
- భారత్ తరఫున విదేశాంగా మంత్రి జైశంకర్ హాజర్
- టెక్ దిగ్గజాలు సైతం హాజరవుతున్నట్లు సమాచారం
వాషింగ్టన్, జనవరి 15: అమెరికా అధ్యక్షుడిగా మరోమారు విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార మార్పడి కార్యక్రమం సులువుగా సాగేలా బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమెరికా అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్మస్క్, మార్క్ జుకర్బర్గ్ , జెఫ్ బెజోస్ హాజరవుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీరే కాకుండా అనేకమంది దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారు. జనవరి 20న అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్కు, ట్రంప్నకు పొసిగేది కాదు.
బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ దిన పత్రిక ట్రంప్ విధానాలను విమర్శించేది. మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్కు, ట్రంప్నకు మధ్య కూడా విభేదాలు ఉండేవి. 2021లో అమెరికా పార్లమెంటు భవనంపై ట్రంప్ అనుయాయులు దాడి చేయడంతో ఆయన్ను ఫేస్ బుక్ నుంచి బహిష్కరించారు. 2023లో ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాను పునరుద్ధరించారు. అయినా జుకర్ బర్గ్పై ట్రంప్ విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు ఉభయుల మధ్య సయోధ్య సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ టెక్ దిగ్గజాలు పాత విభేదాలను పక్కనపెట్టి ఆయనకు దగ్గరవుతున్నారు. ట్రంప్ పదవీ స్వీకార సమయంలో వేడుకలు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణ నిధికి ఇప్పటికే జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్ మొదలైనవారు విరాళాలు ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్లో ట్రంప్ పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వీరిరువురూ ట్రంప్ను వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపారు.