హైదరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు నగరవాసులు పయనమవుతున్నారు. దీంతో ప్రధాన రహదారులైన విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రహదారులు వాహనాలకు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్రాఫిక్ను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ మార్గంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యంగా అవుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 12 టోల్ బూత్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపునకు వాహనాలను పంపిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు ప్రతి సెకన్కు 4 వాహనాలు వెళ్తున్నాయి. అంటే పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటకు 900 వాహనాల్ ఏపీకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హైవేపై ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను ఒక క్రమపద్ధతిలో ముందుకు పోనిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ట్రాఫిక్ను క్లియర్ చేసే విధంగా అక్కడక్కడ భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు.
