ఢిల్లీ ఎన్నికల వేళా.. 25 లక్షల ఆరోగ్యబీమా ప్రకటించిన కాంగ్రెస్‌

  • శీష్‌మహల్‌ విమర్శలపై ఆప్‌, బిజెపిల ఆందోళన

న్యూఢిల్లీ, జనవరి 08: దేశ రాజధాని దిల్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన క్రమంలో కాంగ్రెస్‌ దిల్లీ వాసులకు హావిూల వర్షం కురిపిస్తోంది. తాజాగా ’జీవన్‌ రక్ష యోజన’ అనే పథకాన్ని కాంగ్రెస్‌ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామని కాంగ్రెస్‌ హవిూ ఇచ్చింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ బుధవారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పథకాన్ని అమలుచేశామని గుర్తుచేశారు. ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా దీన్ని అమలుచేసినట్లు తెలిపారు. దిల్లీకి ఈ పథకం ఓ గేమ్‌ఛేంజర్‌ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ’ప్యారీ దీదీ యోజన’ పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇదిలాఉండగా.. దేశ రాజధాని దిల్లీలో జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలావుంటే అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తోన్న తరుణంలో దిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆప్‌, భాజపా ఏ వేదికా వదలకుండా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ’సీఎం బంగ్లా’ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బంగ్లాను ’శీష్‌ మహల్‌ అంటూ భాజపా చేస్తోన్న విమర్శలను ఆప్‌ తిప్పికొడుతోంది.

తాజాగా ’నిజాన్ని చూపిస్తాం’ అంటూ ఆ పార్టీ సంజయ్‌ సింగ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌ విూడియాను తీసుకొని ఆ అధికారిక నివాసం వద్దకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్‌ నేతలు మండిపడ్డారు. దాంతో సీఎం నివాసం ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆప్‌ నేతలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దానిలో భాగంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ‘ఎవరినీ లోపలికి అనుమతించ వద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు. ఈ పోలీసు చర్య భాజపాకు సంతోషాన్ని కలిగిస్తుంది‘ అని సౌరభ్‌ విమర్శించారు.

తర్వాత సింగ్‌తో పాటు కొద్దిసేపు ధర్నాకు కూర్చొని.. ప్రధాని అధికారిక నివాసం ఉన్న లోక్‌కల్యాణ్‌ మార్గ్‌ వైపు వెళ్లారు. పీఎం నివాసం సవిూపంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఆప్‌నకు కౌంటర్‌గా భాజపా దిల్లీ సీఎం అధికారిక నివాసం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దిల్లీలోని 6 ప్లాగ్‌ స్టాఫ్‌ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్‌ కేజీవ్రాల్‌ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. ఈ బంగ్లాను ’శీష్‌ మహల్‌ గా భాజపా అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. దీనికి కౌంటర్‌గా పీఎం నివాసాన్ని ’రాజ్‌ మహల్‌’ అంటూ విమర్శలు చేస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News