హైదరాబాద్, జనవరి 05: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేకాధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సచివాలయంలో సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్లతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు అధికారులు వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB)తో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.