అమరావతి, జనవరి 04: రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ’గేమ్ ఛేంజర్’ కియారా అడ్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్టీ ప్లెక్స్లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరులో విడుదలైన ’పుష్ప2’ టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ముందురోజు రాత్రి 9.30 గంటల షోకు టికెట్ ధరపై రూ.800 పెంచగా, పన్నులతో కలిపి రూ.1000 దాటిపోయింది. మల్టీప్లెక్స్లలో ఈ ధర ఏకంగా రూ.1200లకు చేరింది. సంధ్య థియేటర్ ఘటన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈసారి ఏపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ప్రీమియర్ షోలు లేకుండా జాగ్రత్త పడిరది. అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలైనప్పుడు అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షోకు అనుమతి ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఏపీ ప్రభుత్వం అదే దారిలో నడిచింది.
’పుష్ప2’తో పోలిస్తే, ’గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలను కాస్త అందుబాటులోనే ఉంచింది. జనవరి 11 నుంచి 23 వరకూ అంటే దాదాపు 13 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండటంతో పాటు, ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం వసూళ్లపరంగా సినిమాకు మేలు చేసే అంశం. ప్రస్తుతం టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే పడిరది. ’రాబోయే సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఉండదు’ అని ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సినిమాలపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.