- కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆనం
విజయవాడ, జనవరి 04: రాష్ట్రంలోని ఆలయాల ఆధునికీకరణ, అభివృద్ధి, మెరుగైన సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ఇంద్రకీలాద్రికి వచ్చిన మంత్రికి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇన్ఛార్జి ఈవో రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
దర్శనం పూర్తయ్యాక మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆ దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమైన ఆనం.. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని.. భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాద పూర్వకంగా ప్రవర్తించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.