- తెలియకుండానే తెలుగు అంతరించే ప్రమాదం
- ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన
- తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు
- సినిమా పేర్లు తెలుగులో ఉండాల్సిందే
హైదరాబాద్, జనవరి 04: మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు. హైదరాబాద్లో రెండో రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర తెచ్చిన కొత్త విద్యా విధానాన్ని రాష్టాల్రు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో జరగాలని డిమాండ్ చేశారు. సినిమాల పేర్లు కూడా తెలుగులోనే ఉండాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిర్వహకులు సన్మానించారు. మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలో మాతృ భాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు. ‘వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించు కోవాలన్నారు. బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలి. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలి.
కొత్త సాంకేతికత, కార్యక్రమాలను మాతృభాషలోనే చేపట్టాలి. వాడుక భాషలో 30 శాతమే తెలుగు ఉంది. 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయి. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి కనినిస్తోందని అన్నారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలి. కేంద్రం తెచ్చిన కొత్త విధానాన్ని అమలు చేయాలి. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలి. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలి. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలని కిషన్ రెడ్డి అన్నారు.