చలితో వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు

  • దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • ఆలస్యంగా 250 విమానాల రాకపోకలు

న్యూఢిల్లీ, జనవరి 04: చలి తీవ్రతకు ఉత్తర భారతం వణుకుతోంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజిబిలిజీ జీరోకు పడిపోయింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే దాదాపు 250 విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాలను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఇక కోల్‌కతా విమానాశ్రయంలో 40 విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరో ఐదు విమానాలను రద్దు చేసినట్లు ఫ్లైట్‌ మానిటరింగ్‌ ప్లాట్‌ఫాం ఫ్లైట్‌రాడార్‌ తెలిపింది. చండీగఢ్‌, అమృత్‌సర్‌, ఆగ్రా సహా ఉత్తరాదిలోని ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆయా విమానాశ్రయాల్లో విజిబిలిటీ జీరోగా నమోదైంది. మరోవైపు రైలు సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 50కిపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

న్యూఢిల్లీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (22436) దాదాపు నాలుగు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తోంది. వారణాసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 14 గంటలు, మరో న్యూఢిల్లీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎనిమిది గంటల 17 నిమిషాలు, ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏడు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, లక్నో, ఆగ్రా, కర్నాల్‌, ఘజియాబాద్‌, అమృత్‌సర్‌, జైపూర్‌ సహా ఇతర ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో దృశ్యమానత దారుణంగా పడిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News