న్యూఢిల్లీ, జనవరి 04: యూపీలోని నోయిడాకు చెందిన ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న తుషార్ సింగ్ బిస్త్ అనే 23 వ్యక్తి డేటింగ్ యాప్ ద్వారా సుమారు 700 మంది మహిళలను మోసం చేశాడు. మోడల్ అని చెప్పుకుంటూ అతను ఆ మోసాలకు తెగించాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అతను.. గత మూడేళ్ల నుంచి ఓ కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్గా చేస్తున్నాడు. అతని తండ్రి ఓ డ్రైవర్. తల్లి ఇంటికే పరిమితం. సోదరి గురుగ్రామ్లో పనిచేస్తుంది. తుషార్కు ఉద్యోగం ఉన్నా.. డబ్బు, మహిళల మీద మోజుతో సైబర్ నేరాలకు పాల్పడ్డాడు.
ఓ యాప్ ద్వారా విపిన్ మొబైల్ నెంబర్ తీసుకున్న అతను, పాపులర్ డేటింగ్ యాప్ల్లో ఫేక్ ప్రొఫైల్ను క్రియేట్ చేశాడు. బంబ్లీ, స్నాప్చాట్ లాంటి మీడియాల్లో అతను ఆ ప్రొఫైల్ను పెట్టాడు. ఇండియాకు విజిట్ చేస్తున్న అమెరికా ఫ్రీలాన్స్ మోడల్గా అతను ఐడీ క్రియేట్ చేశాడు. ఓ బ్రెజిల్ మోడల్ నుంచి చోరీ చేసిన ఫోటోలు, స్టోరీలతో అతను ఫేక్ ఐడీ సృష్టించాడు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య మహిళల్ని అతను టార్గెట్ చేసేవాడు. తొలుత ఆ అమ్మాయిలను స్నేహితులుగా మార్చుకుని .. మోసాలకు పాల్పడ్డాడు. అమ్మాయిల నుంచి నమ్మకం గెలిచిన తర్వాత వారి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు.
ఆ తర్వాత ఫ్రెండ్షిప్ పేరుతో రహస్య ఫోటోలు, వీడియోలను అడిగేవాడు. ఆ తర్వాత ఆ విజువల్స్ను అతను తన ఫోన్లో సేవ్ చేశాడు. తొలుత వ్యక్తిగత సంతోషం కోసం చేసినా.. ఆ తర్వాత అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న వీడియోలను చూపించి డబ్బు కోసం బెదిరించేవాడు. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వనని బెదిరిస్తే, అప్పుడు అతను ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తానని బెదిరించేవాడు. బంబ్లీ డేటింగ్ యాప్లో 500 మంది , స్నాప్చాట్లో 200 మంది అమ్మాయిలతో చాటింగ్ చేసేవాడు. అయితే ఢిల్లీ వర్సిటీ సెకండ్ ఇయర్ అమ్మాయిని సైబర్ మోసం చేసిన కేసులో అతను చిక్కాడు.
బంబ్లీలో అతను అమెరికా మోడల్గా పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత వాట్సాప్, స్నాప్చాట్లో ప్రైవేట్ చాటింగ్ చేశాడు. బాధితురాలు వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అతను ఇష్టపడలేదు. ఆ తర్వాత ప్రైవేటు వీడియోను పంపి డబ్బుల కోసం బెదిరించాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే లీక్ చేస్తానని హెచ్చరించాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆమె తన పేరెంట్స్కు చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ అరవింద్ యాదవ్ పర్యవేక్షణలో సైబర్ పోలీసులు ఓ బృందంగా మారి.. ఇంటెలిజెన్స్ ద్వారా తుషార్ కార్యకలాపాలను గుర్తించాడు.
షాకార్పుర్లో రెయిడ్ చేసి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు తమ ఆపరేషన్లో ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో విపిన్తో లింకున్న డేటాను సేకరించారు. 13 క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన 60 మంది మహిళలతో జరిపిన వాట్సాప్ సంభాషణలను కూడా రికవరీ చేశారు. తుషార్కు చెందిన రెండు అకౌంట్లను సీజ్ చేశారు. ఒకదాంట్లో పేమెంట్స్ ఉన్నాయి.