అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్కు దైవభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకుంటుంది. తాజాగా ఇవాళ కూడా జాన్వీ వెంకన్నను దర్శించుకుంది. కొత్త ఏడాది సందర్భంగా స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది.
ఆలయానికి చేరుకున్న జాన్వీ కపూర్కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం సందర్భంగా జాన్వీ కపూర్ సంప్రదాయ లంగాఓనీలో ఎంతో అందంగా కనిపించింది. తిరుమల విజిట్కు సంబంధించిన ఫొటోలను జాన్వీ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. అందులో తిరుమల లడ్డూను తింటున్న ఫొటో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.