- ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
- విజయవాడలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన పవన్
- పివిపై రాసిన పుస్తకావిష్కరణ చేసిన డిప్యూటి సిఎం
విజయవాడ, జనవరి 02: తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సాహితీ వేత్తగా, రచయితగా మహోన్నతులు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. పీవీ గురించి మాట్లాడే అంత జ్ఞానం తనకు లేదని చెప్పారు. తనకు అంత జ్ఞానం వచ్చాక మాట్లాడతానని అన్నారు. పీవీ తన గ్రంధాలయం తీసుకుని ఏపీకి వద్దామనుకున్న సమయంలో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.
ఢిల్లీలో పీవీకి సరిగ్గా ఖనన కార్యక్రమం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి నివాళి అర్పించడానికి ఢిల్లీలో సమాధి లేదన్నారు. లక్షల మంది ముందుకు వచ్చి ఢిల్లీలో స్మృతి వనం ఏర్పాటు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వనవాసి, అక్షర సత్యామృతం, ఏది పాపం, నానీపాల్కే వూ ది పీపుల్ ఇలా ఎన్నో పుస్తకాలు తాను చదివిన వాటిలో ఉన్నాయని తెలిపారు. .ఇక నుంచి తన ట్విట్టర్లో అప్పుడప్పుడు పుస్తకాలపై పోస్ట్ పెడతానని పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఓజి ఓజి అంటూ అభిమానుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజి అనే కన్నా శ్రీశ్రీ అంటే బాగుంటుందని పవన్ కల్యాణ్ చమత్కరించారు.శ్రీశ్రీ మహా ప్రస్థానం, విశ్వానాధ సత్యనారాయణ , ఇతర కవులు ఎన్నో వేదనలతో రచనలు చేశారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు రాసిన పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. మైండ్కు శిక్షణ ఇస్తాయని.. అందుకే స్టేడియంలో శారీరక ధారుడ్య తరహాలో.. మెదడు ధారుడ్యం కోసం స్టేడియం ఇవ్వాలని చెప్పానని అన్నారు.తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకాలు ఇచ్చాయని ఉద్ఘాటించారు. తనకు ఐదో తరగతి నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకున్నా అని చెప్పారు. మా అమ్మ , నాన్న వల్ల పుస్తక పఠనం అలవాటు అయ్యిందని గుర్తుచేశారు. కోటి రూపాయలు ఇస్తా కానీ, ఒక మంచి పుస్తకం ఇవ్వాలంటే ఎక్కువ సార్లు ఆలోచిస్తానని అన్నారు.తన జీవితంలో పుస్తక పఠనం లేకుంటే తాను ఏమయ్యేవాడినో అనిపిస్తుంద న్నారు. తాను కోరుకున్న జీవితం పుస్తకాల్లో కనిపించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. విూ భవిష్యత్తు కు ఒక ధైర్యం ఇస్తుంది. యువత పుస్తకాలు కొనండి, చదవండి, చదివించండి. అధ్యాపకులకు అధికంగా జీతాలు ఉండాలి. సమాజాన్ని ప్రభావితం చేసే అధ్యాపకులకు గుర్తింపు ఉండాలి. చిరిగిన చొక్కా తొడుక్కోకానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటుగా మార్చుకోండి. అభిమానులు అరవడం కాదు.. పుస్తకం చదవాలన్న నా పిలుపును ఆచరించాలి‘ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.అమృతం కురిసిన రాత్రి పుస్తకం, నేను తొలిసారిగా కొన్నాను. కొత్త పుస్తకాల సువాసన .. మట్టి వాసన లాగా చాలా బాగుంటుంది. రాజకీయాల్లో ఇంత బలంగా నిలబడ్డానంటే పుస్తక పఠనం కారణం.
కథల్లో ఉన్న భావాలు, కష్టం, నష్టంపై బాగా ఆలోచనలు చేసే వాడిని. విశ్వనాథ సత్యనారాయణ రచనలు ‘ఆహా ఓహో‘ నన్ను ఆలోచింప చేసింది. గుర్రం జాషువా ‘ఫిరదౌసి‘ నన్ను చాలా ఆకట్టుకుంది. ఎడ్వంచర్ అంటే ‘బంగారం చేయడం ఎలా‘ అనే పురుషోత్తం పుస్తకం చదివా. గోపీచంద్ రచనలు సమాజంలో మంచి చెడులు తెలుపుతాయి‘ అని పవన్ కల్యాణ్ తెలిపారు. విద్యార్థులు తెలుగు వ్యాకరణంపై దృష్టి పెట్టాలి. ఇంగ్లీషు నేర్చుకోండి, మాతృభాష ద్వారానే పట్టు సాధ్యం. ఇంగ్లీషు వల్లే అంతా జరిగిపోదు, ఉద్యోగాలు వచ్చేయవు. మనలో సృజనాత్మకత ఉండాలంటే మాతృభాషపై పట్టు ఉండాలని అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఒక ధిక్కార స్వరమని ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు తెలిపారు.
తెలుగునాట కొద్ది మందికే అలా ఉంటుందని అన్నారు. స్వాతంత్య సమరయోధుడుగా ఉన్న సీఎం, పీఎం ఎంతోకాలం తర్వాత పీవీకి దక్కిందని చెప్పుకొచ్చారు. అలాంటి ధీరత్వం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లోనే తాను చూశానని చెప్పారు. ఓడినా .. ప్రజలకోసం పవన్కల్యాణ్ ముందుకు నడిచారని గుర్తుచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగాను ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. ఓడినవారు పవన్కల్యాణ్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోతారని కృష్ణారావు తెలిపారు.
కార్యక్రమంలో సాహిత్య అకాడవిూ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ’ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుందని వీబీఎఫ్ఎస్ కార్యదర్శి మనోహర్నాయుడు తెలిపారు. ఈ ఏడాది 270 స్టాళ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.