ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చా

  • ప్రతి ఒక్కరికీ న్యాయంగా పనులు చేయించాలనే తపన
  • పల్నాడు జిల్లా యల్లమందలో పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు

గుంటూరు, డిసెంబర్‌ 31: ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి.. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కనీసం నవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నాం. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్‌ ద్వారా సమాచారం వస్తుంది.

డ్రోన్లను కూడా సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే నేను కష్టపడుతున్నా. ఏ ఇంట్లో కష్టమొచ్చినా వాళ్ల ఇంట్లో నేనొక ప్రాణ స్నేహితుడి గా ఉండి వాళ్లను కాపాడుకుంటాను. నేను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే నా ఆలోచన. నాకు హైకమాండ్‌ ఎవరూ లేరు. ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్‌ ‘ అని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సిద్దాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని.. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హావిూ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతా పింఛన్లను ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేపట్టారు.

అందులో భాగంగా మంగళవారం ఉదయం పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం యలమందల గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్దిదారులకు ఫెన్షన్‌ పంపిణీ చేసారు. అనంతరం ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.కాగా రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 85.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు.

ఉదయం 10 గంటలకు సమయానికే 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జీయో ట్యాగింగ్‌ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జీయో ట్యాగింగ్‌ ద్వారా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీయో ట్యాగింగ్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కృష్ణా జిల్లా, గుడివాడ 11వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్దిదారులకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫౌజ్‌ పింఛన్ల నగదు కూడా ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆరు గంటలకే పెన్షన్‌ లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు ఆయన అందజేశారు. న్యూ ఇయర్‌కు ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడంతో పెన్షన్‌ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News