కొత్త సంవత్సరంలో ప్రజల కోసం పనిచేయాలి !

కొత్త సంవత్సరంలో అధికార విపక్షాలు పరస్పర విమర్శలు మాని ఇక ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు లక్ష్యంగా సమస్యలపై పోరాడాలి. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. లేకుంటే ప్రజల్లో ఇరు పక్షాల పట్ల ఏహ్యభావం ఏర్పడగలదు. ఇకపోతే రాజకీయంగా 2024 సంవత్సరం కాంగ్రెస్‌కు కలసి రాగా.. ప్రధాని మోడీకి మాత్రం హెచ్చరిక చేసింది. రెండు పర్యాయాలు అత్యధిక మెజార్టీతో గెలిచిన బిజెపి..మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బాగా దెబ్బతిని మెజార్టీకి దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదో హెచ్చరికగా గుర్తించాల్సిన మోడీ..అలా చేయడం లేదు. పాలనలో మార్పు కనిపించడం లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇదే ఏడాది కాంగ్రెస్‌ పార్టీకి కొద్దో గొప్పో కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకొంది.

దీంతో లోక్‌సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఇక కేరళలోని వయనాడ్‌ లోక్‌ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకగాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాంతో ఆమె సైతంపార్లమెంట్‌ సభ్యురాలిగా తొలిసారిగా లోక్‌ సభలో అడుగు పెట్టారు. ఇది ఓ రకంగా సోనియా కుటుంబానికి కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. వారికి పార్టీలో ఇక తిరుగులేదన్న విధంగా పరిస్థితి మారింది. అన్నా చెల్లెళ్లు లోక్‌సభలో, తల్లి సోనియా రాజ్యసభలో ఉన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సారథ్యంలో మోదీ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వరుసగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. అంటే 2019లో సైతం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఆ హోదాను దక్కించుకోవడమే కాకుండా.. ప్రియాంక సైతం ఎంపీగా గెలుపొందారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ.. తమ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథితోపాటు కేరళలోని వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మతీ ఇరానీ బరిలో నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గం ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల పోలింగ్‌ మొత్తం 7 దశల్లో జరిగింది. దీంతో వయనాడ్‌ ఎంపీ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేశారు. తొలి దశలోనే ఈ నియోజకవర్గం పోలింగ్‌ జరిగింది. అనంతరం రాయబరేలి నుంచి సైతం పోటీ చేయాలని ఆయనపై పార్టీ ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో ఆయన ఆ స్థానం నుంచి బరిలో దిగారు. ఇక ఎన్నికల ఫలితాల్లో ఆయన రెండు స్థానాల నుంచి విజయకేతనం ఎగుర వేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి వచ్చింది.

దీంతో రాహుల్‌ గాంధీ వయనాడ్‌ స్థానాన్ని వదులు కోవాగా, ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీని కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అలా ఆమె సైతం లోక్‌ సభలో అడుగు పెట్టారు. అదీకాక.. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనే ప్రియాంక గాంధీ ఇలా లోక్‌ సభలో అడుగు పెట్టేందుకు వయనాడ్‌ వేదికగా మారింది. లోక్‌ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి మరో గొంతుక ప్రియాంక రూపంలో తోడు అయినట్లు అయింది. మొన్నటి శీతాకాల సమావేశాల్లో ఆమె గట్టిగానే నిలబడ్డారు. తన సత్తా చాటారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన తర్వాత ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాల గురించి కాంగ్రెస్‌ తన ఆందోళనా స్వరాన్ని పెంచింది.

ఎన్నికల సమగ్రతకు సంబంధించి చాలా అంశాలున్నాయి. వాటి పట్ల భారత ఎన్నికల సంఘం స్వచ్ఛంగా వుండాల్సిన అవసరముంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంలో కేసు కూడా దాఖలు చేసింది. ఇ.వి.ఎం లను ఎలక్టాన్రిక్‌ ట్యాంపరింగ్‌ చేసే ముప్పు కొనసాగిందన్న వాదనతో కాంగ్రెస్‌ గొంతెత్తుతోంది. అది కూడా ఎంపిక చేసుకున్న అంశాలపైనే, అందులోనూ ఓడిపోయిన వాటిపైనే మాట్లాడుతోంది. ఇ.వి.ఎం లకు సంబంధించి అవకతవకల ముప్పు వుందని సూచించేలా పరోక్షంగా లేదా ముందుగానే ప్రోగ్రామింగ్‌ చేయడం ద్వారా ట్యాంపరింగ్‌ జరిగి వుంటుందన డానికి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్‌ నేతలే కొందరు బహిరంగంగా అభిప్రాయపడ్డారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీ కూడా ఈ ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు.

ఇ.వి.ఎం లలో చాలా కచ్చితంగా, తెలివిగా అవకతవకలకు పాల్పడ్డారని భావించేందుకు వీల్లేదు. ఎందుకంటే, కొన్ని రాష్టాల్ల్రో బిజెపి విజయం సాధించింది, మరికొన్ని రాష్టాల్ల్రో ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ లాజిక్‌ పని చేయడం లేదు. ఇదంతా కాకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయింది. పైగా, ఈ ఫలితాలన్నీ మరీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఫలితాలు సామాజిక, రాజకీయ సవిూకరణలు ఎలా పనిచేసినవో సరిగానే వివరించాయి. మహారాష్ట్రలో ఇవిఎంల ట్యాంపరింగ్‌పై సుప్రియా కూడా విభేదించారు. ఇలా జరిగివుంటే అందరం ఓడిపోయేవారమన్న భావనను వ్యక్త పరిచారు. అంతెందుకు ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగివుంటే బిజెపి కేంద్రంలో భారీ మెజార్టీతో గెలిచేవారు.

రాయబరేలీ, అమేథీ, వయనాడ్‌లలో కూడా బిజెపి గెలిచివుండేది. కాబట్టి ఈ విషయాల జోలికి ఇక పోకపోవడమే మంచిది. ఇవిఎంల గురించి గతంలో ఎన్నికల సంఘం పలుమార్లు వివరణ ఇచ్చింది. కాంగ్రెస్‌ ఈ విషయంలో అతిగా మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటే ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగివుంటే కాంగ్రెస్‌ ఈ స్థాయికి వచ్చేది కాదు. అలాగే మోడీ కూడా భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వారు. ఇకపోతే మోడీ కూడా ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి పెట్టాలి. క్షుద్ర రాజకీయాలు మాని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్‌ కూడా ప్రజల సమస్యలు ఎజెండాగా నిర్మాణాత్మక విపక్ష పాత్రను పోషించాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News