అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

సంధ్య థియేటర్‌ ఘటనలో టాలీవుడ్‌ యాక్టర్‌ అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు అల్లు అర్జున్‌ వర్చువల్‌గా హాజరయ్యాడు. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు పీపీ కోర్టును సమయం కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్‌ నేటితో ముగియనుంది. అయితే ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. పుష్ప2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొకిసలాట ఘటనపై అరెస్టయిన అల్లు అర్జున్‌కు ఈ నెల 13న హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

నాలుగు వారాలపాటు ఈ బెయిల్‌ను మంజూరుచేసిన కోర్టు రూ.50 వేల వ్యక్తిగత బాండ్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. తొక్కిసలాటలో మరణించిన మహిళ భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు చేయాలంటూ అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిసన్‌పై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్‌ యజమానులు ఇద్దరికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. ఇంకా అరెస్ట్‌ కాని ఇతర నిందితుల్లో నలుగురు సంధ్య థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు ఉత్తర్వులను జారీచేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News