నిమ్స్‌లో మాజీ ఎంపీ జగన్నాథంకు హరీష్‌ పరామర్శ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26: నిమ్స్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీశ్‌రావు. అనంతరం జగన్నాథం ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హరీశ్‌రావు తెలుసుకున్నారు. మందా జగన్నాథంను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌, మాజీ మంత్రులు దయాకర్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌ రెడ్డి కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జగన్నాథంను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్‌ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌పై మళ్లీ విజయం సాధించారు. ఆతర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్‌ ఆయనను నియమించారు. 2023 నవంబర్‌ 17న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News