సిఎంతో టాలీవుడ్‌ సినీ ప్రముఖుల సమావేశం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశానికి అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం 10.00 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజుతోపాటు పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహా తదితరులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమల సమస్యలే ఎజెండాపైనే చర్చ జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ నేపథ్యంలో రేపటి భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్‌ 04వ తేదీ రాత్రి ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీ రిలీజ్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని అభిమానులతో వీక్షించేందుకు హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

దీంతో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కిమ్స్‌ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేసి.. జైలుకు తరలించారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ మంజూరు అయింది. దీంతో అల్లు అర్జున్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో సైతం ఈ వ్యవహరంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్‌ స్పందించారు. నేపథ్యంలో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లతోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు సైతం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకోవైపు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన వారు పరామర్శిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News