కీలక పోరుకు సిద్దమైన టీమిండియా

ఐదు టెస్ట్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. గురువారం నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా నిలిచిన విషయం తెలిసిందే. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న టీమిండియా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరులో బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించిన టీమిండియా.. తుది జట్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావించిన టీమిండియా.. పేస్‌ ఆల్‌రౌండర్‌, తెలుగు తేజం నితీష్‌ కుమార్‌ రెడ్డిపై వేటు వేయనున్నట్లు ఆసీస్‌ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడిరచారు. బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోతున్న నితీష్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నితీష్‌ కుమార్‌ రెడ్డి బ్యాట్‌తో పర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో తేలిపోయాడు. దాంతో బౌలింగ్‌ విభాగం బలహీనంగా మారిపోయింది. మరో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా కొనసాగనున్నాడు.

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ తొలి టెస్ట్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలతో కేఎల్‌ రాహుల్‌ రాణించాడు. దాంతో రెండో టెస్ట్‌కు రోహిత్‌ అందుబాటులోకి వచ్చినా.. రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించారు. అతని కోసం రోహిత్‌ శర్మ మిడిలార్డర్‌లో ఆడాడు. కానీ గత రెండు టెస్ట్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మను మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రోహిత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగితే కేఎల్‌ రాహుల్‌ ఫస్ట్‌ డౌన్‌లో ఆడనున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ కొనసాగే ఛాన్స్‌ ఉంది. సిరాజ్‌ను పక్కనపెట్టాలని భావిస్తే హర్షిత్‌ రాణా తుది జట్టులోకి వస్తాడు. మరోవైపు తొలి టెస్టులో బుమ్రా అత్యత్తమ ప్రదర్శన వల్లే భారత్‌ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి కాస్త సహకారం లభించింది. కానీ, రెండో టెస్టులో హెడ్‌ను భారత్‌ ఆపలేకపోయింది. ఓ ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచినప్పటికీ, మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. ఇక మన బ్యాటర్లూ విఫలమవడం వల్ల ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఇక గబ్బా టెస్టులో బుమ్రాది ఒంటరి పోరాటమే. బ్యాటర్లూ తేలిపోయారు. మిగతా బౌలర్లూ చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఓ వైపు వికెట్లు పడగొడుతూన్నా, మరోవైపు నుంచి ఏ బౌలర్‌ కూడా కనీసం ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియా కోల్పోయిన తొలి 6 వికెట్లలో 5 బుమ్రానే పడగొట్టం విశేషం. ఆసీస్‌ బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ, మిగత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో వర్షం కలిసొచ్చి మ్యాచ్‌ డ్రా గా ముగిసింది. దీంతో సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. కాగా, మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్‌లో పేస్‌కు అనుకూలించే పిచ్‌ను బుమ్రా బౌలింగ్‌ దళం ఎలా ఉపయోగించుకుంటుందన్నది కీలకం.

బుమ్రా ఉత్తమ ప్రదర్శన చేస్తాడనడంలో ఎవరికీ డౌట్‌ లేదు. అయితే మిగతా పేసర్లు మరో ఎండ్‌లో అతడిసి సహకరిస్తే, ఆసీస్‌ బ్యాటర్లకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా హెడ్‌ను కంట్రోల్‌ చేయాలి. అతడిని మాటలతో రెచ్చగొడుతున్న సిరాజ్‌, బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపట్లేదు. అయితే మెల్‌బోర్న్‌ పిచ్‌ అతడికి సహకరించవచ్చు. ఇక్కడ అతడు విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా 21 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, మిగిలిన టీమ్‌ఇండియా బౌలర్లలో 3 మ్యాచ్‌ల్లో సిరాజ్‌ 13 వికెట్లు, 2 మ్యాచ్‌ల్లో హర్షిత్‌ రాణా 4 వికెట్లు, ఒక మ్యాచ్‌ ఆడిన ఆకాశ్‌ దీప్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంటే ఈ ముగ్గురి వికెట్లు కలిపినా 19 మాత్రమే అవుతాయి.

దీన్ని బట్టే బుమ్రా టీమ్‌ఇండియాకు ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. అయితే టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళంలో అతడికి సహకారం కరవైంది. జట్టులో మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు ఎలాంటి సహకారం అందడం లేదు. మరి సిరీస్‌ గమనాన్ని నిర్దేశించే నాలుగో టెస్టులో అయినా సహచర బౌలర్లు పేస్‌ దళపతికి అండగా నిలుస్తారా? అనేది అభిమానల్లో ఆందోళన కలిగిస్తోంది. బాక్సింగ్‌ డే టెస్ట్‌ కోసం భారత తుది జట్టు(అంచనా) యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రాణా/మహమ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News