మెదక్, డిసెంబర్ 25: మెదక్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు వన దుర్గాదేవిని దర్శించుకున్నారు.
ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మెదక్ చేరుకున్న సీఎం రేవంత్.. అక్కడ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ చర్చికి చేరుకున్నారు. అక్కడ చర్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆపై అక్కడ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.