న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒంటరి పురుషులను ఆకర్షించి పెళ్లి చేసుకున్న తరువాత వారిని దోచుకొని పరారవుతున్న ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్, సంజనా గుప్తా, విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి నలుగురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనమ్ పెళ్లి కూతరులా, సంజనా ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేశ్, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా.. అని టార్గెట్స్ కోసం వెతుకుతారు. టార్గెట్ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు రూ.1.5 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు. అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనమ్, సంజనాల దగ్గరికి తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనమ్ పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది.
అక్కడ అవకాశం చిక్కేదాక అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగదు, నగలు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపధ్యాయ్ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్ చేసింది. విమలేష్, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనమ్, సంజనాలతో మాట్లాడిరచారు. అయితే శంకర్ ఉపాధ్యాయ్కి వారు తీరుపై అనుమానం కలిగింది. దాంతో రూ.1.5 లక్షలకు ముట్టజెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనమ్ ముఠా అతడిని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.