మెదక్, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో మెదక్ చర్చిని సందర్శించారు. అంతకుముందు ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మెదక్కు వచ్చే దారులన్నీ పోలీసులు మూసివేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో 40 నిమిషాల పాటు ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో పోలీసుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ను ఎందుకు ఆపారంటూ కొందరు ప్రయాణికులు, వాహనదారులు పోలీసులను ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి వచ్చాడు.. మాకు పై నుండి ఆదేశాలు ఉన్నాయి. మీ వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోయే వరకు మేము వాహనాలను, నార్మల్ ప్రజలను అనుమతి ఇవ్వం అంటూ పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల చర్యలతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదీ కాంగ్రెస్ పాలన అంటూ పెదవి విరిచారు. ఇక మెదక్ చర్చి వద్ద కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడని చర్చి గేట్లు మూసివేశారు. దీంతో గేట్ల బయట వేలాది మంది క్రిస్టియన్లు గంటల తరబడి నిలబడిపోయారు. ఓ మహిళ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆమె మండిపడ్డారు.