సూర్యాపేట, డిసెంబర్ 25: ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అందరూ పయనించి ప్రేమ, కరుణ ఇతరుల పట్ల చూపించాలని, అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల మాతా చర్చ్, సిల్వి సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, మన్నా చర్చ్, సెయింట్ బాప్టిస్ట్ చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రధాన పండగలను అధికారికంగా నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యత పెంచిన ఘనత కేసీఆర్దే అని స్పష్టం చేశారు. గత పడేండ్లుగా ఆయా మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటూ మరింత ఐక్యతను పెంచుకున్నామన్నారు. క్రిస్మస్, రంజాన్, దసరా పండుగలకు ప్రత్యేక విందులు, దుస్తులు, సామాగ్రిని పంచుతూ గంగా, జమున, తహజీబ్లకు నిలయంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని మతాల ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండి తెలంగాణ సమాజం మరింత అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, ఉప్పల ఆనంద్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, నెమ్మది బిక్షం, జీడీ భిక్షం, తూడి నరసింహారావు, పూర్ణ శశికాంత్, తాహెర్ పాషా, బత్తుల జానీ, గండూరి కృపాకర్లతో పాటు ఆయా చర్చిల పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.