బీజేపీ పార్టీ నేతల బుర్రలు పనిచేయడం లేదు: రాజ్యసభ సభ్యుడు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25: భారతీయ జనతా పార్టీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి పిచ్చిపట్టిందని, ఆ పార్టీ నేతల బుర్రలు పనిచేయడం లేదని ఫైరయ్యారు. ‘మహిళా సమ్మాన్‌ యోజన ’ పథకం అమలులో లేదని, ఇకముందు కూడా అమలు చేయబోవడం లేదని ఢిల్లీకి చెందిన మహిళాశిశు సంక్షేమ శాఖ మంగళవారం ఒక పబ్లిక్‌ నోటీస్‌ను విడుదల చేసింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండటంతో సంజయ్‌ సింగ్‌ స్పందించారు.

బీజేపీ ఒక అబద్ధాలకోరు పార్టీ అని, ఆ పార్టీ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆప్‌ నేత మండిపడ్డారు. బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గి, ప్రభుత్వాన్ని బదనాం చేసేలా పబ్లిక్‌ నోటీస్‌ విడుదల చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రజలు బీజేపీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మబోరని చెప్పారు. కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, బీజేపీ మాత్రం కేంద్రంలో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.

‘బీజేపీకి పిచ్చిపట్టింది. బీజేపీ నేతల మెదళ్లు పనిచేయడంలేదు. బీజేపీ నేతల ఒత్తడికి తలొగ్గి తప్పుడు పబ్లిక్‌ నోటీస్‌ రిలీజ్‌ చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎంగా.. ఉచిత విద్యుత్‌, ఉచిత తాగునీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చారు. కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీ మేరకు మహిళా సమ్మాన్‌ యోజన పథకం కూడా అమల్లోకి వస్తుంది. ఈ పథకం కేవలం హామీ కాదు. ఒక గ్యారంటీ’ అని చెప్పారు.

‘భారతీయ పార్టీ (బీజేపీని ఉద్దేశించి) ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చింది. విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్‌ మనీని బయటికి తీసుకొస్తామని చెప్పింది. రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడుతామని ప్రచారం చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని తెలిపింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదు. దేశాన్ని నాశనం చేశారు. పైగా వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తారు. వాళ్ల అబద్ధాలను జనం నమ్మే పరిస్థితిలో లేరు’ అని సంజయ్‌ సింగ్‌ అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News