అమరావతి, డిసెంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారత్లోనూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు చర్చిలకు పెద్దఎత్తున వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా క్రిస్టియన్లు అందరూ చర్చిలకు చేరుకున్నారు. దీంతో ప్రత్యేక పార్థనలు చేస్తున్న పాస్టర్లు ఏసుక్రీస్తు బోధనలు, గొప్పతనాన్ని భక్తులకు వివరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులకు పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కూటమి నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సైతం చెప్పారు. తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండగ దినమని సీఎం చంద్రబాబు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ప్రేమ మార్గంలో ఎవ్వరి మనస్సునైనా జయించవచ్చని తన జీవితం ద్వారా జీసస్ నిరూపించారని సీఎం కొనియాడారు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే అందరి ముందున్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని గుర్తుచేశారు. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆయన ఆకాంక్షించారు.