అమరావతి, డిసెంబర్ 25: భరత జాతి గర్వించదగిన నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘననివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధానికి ఘటన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్ పేయిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలు స్మరించుకున్నారు. గతంలో ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నా. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది.
అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడిరచాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.